భారత్తో క్రికెట్ సంబంధాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మైదానంలో టీమిండియా అనుసరిస్తున్న తీరుపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇక నుంచి పాకిస్థాన్ ఏ విషయంలోనూ వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు.
ఇటీవల ముగిసిన అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో భారత్పై పాకిస్థాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఈ ఘటనపై నఖ్వీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాహోర్లో జరిగిన మీడియా సమావేశంలో మోహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. ఇక నుంచి భారత్తో సమాన హోదాలో మాత్రమే చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. 'భారత ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ చేయడం ఇష్టం లేకపోతే.. మేం కూడా ఆసక్తి కనబర్చం. ఏం జరిగినా భారత్తో సమాన స్థాయిలోనే పాకిస్థాన్ ఉంటుంది. భారత్ విషయంలో మేం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.
క్రికెట్, రాజకీయాలను వేరుగా చూడాలని పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ నాకు రెండుసార్లు సూచించారు. పాకిస్తాన్ వైఖరి ఎప్పుడూ ఇదేనని ఆయన స్పష్టం చేశారు.'అని మోహ్సిన్ నఖ్వీ తెలిపారు.

ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్లో జరిగిన సీనియర్ ఆసియా కప్లో తొలిసారి ఈ షేక్ హ్యాండ్ వివాదం చోటు చేసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్తో క్రికెట్ ఆడవద్దనే డిమాండ్ దేశవ్యాప్తంగా వ్యక్తమైంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఈ టోర్నీ బరిలోకి దిగిన భారత్.. పాకిస్థాన్తో విజయానంతరం వారికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయింది. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు కూడా చేసింది.
అంతేకాకుండా ఈ టోర్నీలో విజేతగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ సేన.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్గా ఉన్న మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అందుకునేందుకు నిరాకరించింది. దాంతో ఆ ట్రోఫీని మోహ్సిన్ నఖ్వీ తనతో ఎత్తుకెళ్లాడు. ఇప్పటికీ ఆ టైటిల్ను భారత్ అందుకోలేదు. ఈ వ్యవహారంపై ఇరు జట్లు ఐసీసీకి ఫిర్యాదు చేసుకున్నాయి.
భారత అండర్ 19 ఆటగాళ్లు కూడా సీనియర్ ఆటగాళ్ల తరహాలోనే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. భారత ఆటగాళ్ల ప్రవర్తన అనైతకమని పాకిస్థాన్ మెంటార్ సర్ఫరాజ్ ఖాన్తో పాటు మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు. మరోసారి భారత కుర్రాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేశారు.
'భారత్ ఏం చేస్తే.. మేము కూడా అదే చేస్తాం'అనే 'టిట్ ఫర్ టాట్' విధానాన్ని పీసీబీ ఇప్పుడు బహిరంగంగానే ప్రకటిస్తోంది. ఈ పరిణామాలు రాబోయే ఐసీసీ టోర్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.