లాహోర్: ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన ఆసియా కప్ దుబాయ్లో జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలపగా.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్ ఎహ్సాన్ మణి స్పష్టం చేశాడు.
వాస్తవానికి ఈ టోర్నీ పాకిస్థాన్లో జరగాల్సి ఉండగా... పాక్లో ఆడలేమంటూ బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో మార్పు అనివార్యమైంది. అయితే ఆసియా కప్ దుబాయ్లో జరుగుతుందని, ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు రెండూ ఆడతాయని గంగూలీ వెల్లడించాడు. మార్చి 3న జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో పాల్గొనడానికి దుబాయ్ వెళ్తూ.. ఈడెన్ గార్డెన్స్లో మీడియాతో మాట్లాడుతూ గంగూలీ ఈ విషయాన్ని తెలిపాడు.
అయితే గంగూలీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. వేదిక మార్పు విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పీసీబీ ఛీఫ్ ఎహ్సాన్ మణి స్పష్టం చేశాడు. 'అసోసియేట్ సభ్యుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఆసియా కప్ వేదిక మార్పుపై నిర్ణయం తీసుకుంటాం. అన్ని ఆసియా దేశాల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటాం. మాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.'అని తెలిపాడు.
ఇక కరోనా వైరస్ వ్యాప్తి గురించి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పీసీబీ చీఫ్ చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్లో టోర్నీ జరిగే సమయానికి ఈ వైరస్ అదుపులో లేకుంటే అప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధం కావాలన్నాడు.
ప్రస్తుతానికైతే ఇదంత పెద్ద సమస్యే కాదని చెప్పుకొచ్చాడు. భారత్, పాక్ల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఇరు జట్ల మధ్య 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం తలపడుతున్నాయి. ఇరు దేశాల మాజీ ఆటగాళ్లు దాయదీ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించాలని కోరుతున్నారు. 2018 ఆసియా కప్ దుబాయ్ వేదికగా నిర్వహించగా రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ విజేతగా నిలిచింది.