కరాచీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం తాము ఆసియాకప్ను వదులుకోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ను వాయిదా వేసే అవకాశం ఉండటంతో.. సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ను నిర్వహించాలని బీసీసీఐ వెల్లడించింది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఐసీసీ అధికారిక ప్రకటన కోసమే ఎదురుచూస్తుంది. ఈ ప్రకటన జాప్యానికి ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహారే కారణమని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే ఇంతకుముందే ప్రకటించిన ఆసియాకప్ షెడ్యూల్ కూడా సెప్టెంబర్లోనే ఉండడంతో పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఐపీఎల్ కోసం తమ టోర్నీని ఎలా వాయిదా వేసుకుంటామని ప్రశ్నిస్తోంది. అదిగాకుండా ఆసియాకప్ టీ20 టోర్నమెంట్ ద్వారా తమకు, ఇతర బోర్డులకు ఆదాయం లభిస్తుందని, ఐపీఎల్ జరిగితే బీసీసీఐకి మాత్రమే లాభమని గుర్తుచేసింది.
'షెడ్యూల్ ప్రకారం కాకుండా ఆసియాకప్ జరిగేలా చర్చలు సాగుతున్నాయని విన్నాను. కానీ అది సాధ్యం కాదు. కేవలం ఒక్క దేశం కోసం ఈ టోర్నీని ముందుకు జరపడం సరికాదు. అందుకే ఐపీఎల్ కోసం మేం వెనక్కితగ్గడమంటూ ఉండదు. అయినా ప్రేక్షకులు లేకుండా టీ20 ప్రపంచకప్ కూడా జరిగే అవకాశం ఉంది. లేకపోతే ప్రతీ జట్టు 15 నుంచి 20 మిలియన్ డాలర్లు నష్టపోతుంది' అని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ తెలిపాడు.