చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్ సూపర్ బౌలింగ్కు మెరుపు ఫీల్డింగ్ కూడా తోడవడంతో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. వరుస విరామాల్లో పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 120 పరుగులకు కుప్పకూలింది. మయాంక్ అగర్వాల్(25 బంతుల్లో 22), షారుఖ్ ఖాన్(17 బంతుల్లో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్(3/21) మూడు, అభిషేక్ శర్మ(2/24) రెండు వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్(1/16), రషీద్ ఖాన్(1/17) తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(4) భువీ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గేల్తో మయాంక్ ఆడపాదడపా బౌండరీలు బాదాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ వికెట్ నష్టానికి 32 రన్స్ మాత్రమే చేసింది. ఖలీల్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే మయాంక్ అగర్వాల్.. రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్కు వెనుదిరగ్గా.. ఆ వెంటనే పూరన్(0) వార్నర్ సూపర్ త్రోకు డైమండ్ డక్గా వెనుదిరిగాడు.
అనంతరం కొద్దీసేపటికే దీపక్ హుడా కూడా వెనుదిరగడంతో పంజాబ్ 63 రన్స్కే 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన ఫాబియాన్ అలెన్(6), మురుగన్ అశ్విన్(9), మహ్మద్ షమీ(3) ఇలా వచ్చి అలా వెళ్లడంతో పంజాబ్ 120 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోర్. ఐపీఎల్ చరిత్రలో ఇంత తక్కువ స్కోర్ను చేజ్ చేయడంలో సన్రైజర్స్ ఎప్పుడు విఫలం కాలేదు. గతేడాది పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 127 పరుగులనే చేధించలేకపోయింది.