
దుబాయ్: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 2021 సెకండాఫ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ స్లో ఓవర్రేట్కు కారణమైంది. నిర్ణీత సమయంలో 20 ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. దాంతో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్పై ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం రెండోసారి స్లో ఓవర్రేట్కు కారణమైన శాంసన్పై రూ.24 లక్షల జరిమానాతో పాటు తుది జట్టులోని ఆటగాళ్లకు రూ.6 లక్షలు లేదా మ్యాజ్ ఫీజులో 25 శాతం ఏది ఎక్కువైతే దానిని కోత విధించనున్నారు. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఇక పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లోనూ రాజస్థాన్ రాయల్స్ టీమ్ స్లో ఓవర్ రేటుకు కారణమైంది. తొలిసారి స్లో ఓవర్ రేటు నిబంధనలను అతిక్రమించిన కారణంగా ఆ మ్యాచ్లో కెప్టెన్ సంజూ శాంసన్కు ఒక్కడికే రూ.12 లక్షల జరిమానాను విధించారు. మళ్లీ ఈ తప్పిదం రిపీట్ అయితే రూ.30 లక్షల జరిమానాతో పాటు కెప్టెన్ శాంసన్పై ఓ మ్యాచ్ నిషేధం పడనుంది.
తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ.12 లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.
ఐపీఎల్ 2021 సెకండాఫ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. డబుల్ హెడర్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో శనివారం జరిగిన ఫస్ట్ మ్యాచ్లో సమష్టి ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ 33 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకుంది. బ్యాటింగ్లో తడబడినా.. బౌలింగ్లో సత్తాచాటి అద్భుత విజయాన్నందుకుంది. ఫలితంగా పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకొని ప్లే ఆఫ్ బెర్త్ను ఖరారు చేసుకుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమ ప్లే ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన 5 మ్యాచ్ల్లో కనీసం నాలుగు గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(32 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లతో 43), రిషభ్ పంత్(24), షిమ్రన్ హెట్మైర్(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(2/22), చేతన్ సకారియా (2/33) రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగీ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 రన్స్ మాత్రమే చేసి ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 70 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ ఓ వికెట్ తీయగా.. మిగతా బౌలర్లందరూ (ఆవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా, అక్షర్ పటేల్) తలో వికెట్ తీశారు.