ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు తేలిపోయారు. ఆవేశ్ ఖాన్(2/25), కేశవ్ మహరాజ్(2/23) సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులే చేసింది.
జితేశ్ శర్మ(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 29), అషుతోష్ శర్మ(16 బంతుల్లోఫోర్, 3 సిక్స్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. శిఖర్ ధావన్ స్థానంలో ఆడిన అథర్వ టైడ్(15) ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. పిచ్ నుంచి లభించిన సహకారంతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 38 పరుగులే చేసింది.
ఆ వెంటనే సంజూ శాంసన్.. చాహల్ను రంగంలోకి దించగా అతను ప్రభ్సిమ్రాన్ సింగ్(10)ను పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే కేశవ్ మహరాజ్.. సామ్ కరణ్(6)ను ఔట్ చేయగా.. శశాంక్ సింగ్(9)ను కుల్దీప్ సేన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 70 పరుగులకే పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో జితేశ్ శర్మ, లివింగ్ స్టోన్(21) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ ఆవేశ్ ఖాన్ ఈ జోడీని విడదీసాడు. నిలకడగా ఆడుతున్న జితేశ్ శర్మను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 33 పరుగుల స్వల్ప భాగస్వామ్యానికి తెరపడింది.
ఇక కొటియన్ స్టన్నింగ్ త్రోకు లివింగ్ స్టోన్ రనౌటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన అషుతోష్ శర్మ మూడు సిక్స్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.