ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్నందుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసింది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఇదే తొలి పరాజయం కావడం గమనార్హం.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(45 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 67) హాఫ్ సెంచరీతో రాణించగా.. రియాన్ పరాగ్(25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 43 నాటౌట్), కెప్టెన్ సంజూ శాంసన్(26 బంతుల్లో 6 ఫోర్లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్(2/37) రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సెన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసి ఓటమిపాలైంది. నెహాల్ వధేరా(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 62), గ్లేన్ మ్యాక్స్వెల్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/25) మూడు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, మహీష్ తీక్షణ రెండేసి వికెట్లు పడగొట్టారు. కుమార్ కార్తీకేయ, వానిందు హసరంగాలకు చెరో వికెట్ దక్కింది.

మలుపు తిప్పిన తీక్షణ, ఆర్చర్..
భారీ లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరగడంతో పియాన్ష్ ఆర్య(0), శ్రేయస్ అయ్యర్(10) తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరారు. కార్తీకేయ, సందీప్ శర్మ ధాటికి పవర్ ప్లేలోనే పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో గ్లేన్ మ్యాక్స్వెల్, నెహాల్ వధేరా కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాక్సీ నిదానంగా ఆడినా.. వధేరా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను.. రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 88 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని తీక్షణ విడదీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. గ్లేన్ మ్యాక్స్వెల్(30) క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికే హసరంగా.. వధేరాను ఔట్ చేసి పంజాబ్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం లాంఛనమైంది.
4 ఓవర్లలో 55 పరుగులు..
డెత్ ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించింది. చివరి 4 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 55 పరుగులు చేసింది. రియాన్ పరాగ్, హెట్మైర్, ధ్రువ్ జురెల్ ధాటిగా ఆడి జట్టుకు 205 పరుగుల భారీ స్కోర్ అందించారు. ఈ లక్ష్యానికి 20 పరుగులు తక్కువగా చేసినా ఫలితం మరోలా ఉండేది.