మొహాలీ: ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మరో విజయాన్నందుకుంది. పంజాబ్ కింగ్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 24 పరుగుల తేడాతో గెలుపొందింది. మహమ్మద్ సిరాజ్(4/21) సీజన్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చడంతో ఆర్సీబీ విజయం సులువైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 84), విరాట్ కోహ్లీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. ప్రభ్సిమ్రాన్ సింగ్(30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 46), జితేశ్ శర్మ(27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 41) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. హసరంగా రెండు, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు మహమ్మద్ సిరాజ్ గట్టి షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ అథర్వ టైడ్ను సిరాజ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అంపైర్ ఔటివ్వకపోయినా.. ఆర్సీబీ రివ్యూతో ఫలితం రాబట్టింది. హసరంగా వేసిన మూడో ఓవర్లో మాథ్యూ షార్ట్(8) క్లీన్ బౌల్డ్ అవ్వగా.. లియమ్ లివింగ్ స్టోన్(2)ను సిరాజ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.
ఆ తర్వాత సూపర్ రనౌట్తో హర్ప్రీత్ సింగ్ను సిరాజ్ ఔట్ చేయడంతో పంజాబ్ పవర్ ప్లేలో 4 వికెట్లకు 49 పరుగులు మాత్రమే చేసింది. ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కరణ్(10) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హసరంగా సూపర్ ఫీల్డింగ్తో కోలుకోలేని దెబ్బతీసాడు. డైరెక్ట్ హిట్తో సామ్ కరణ్ను పెవిలియన్ చేర్చాడు.
హాఫ్ సెంచరీకి చేరువైన ప్రభ్ సిమ్రాన్ సింగ్ను పార్నెల్ క్లీన్ బౌల్డ్ చేయగా.. డేంజరస్ షారూఖ్ ఖాన్(7)ను హసరంగా కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పంజాబ్ 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో జితేశ్ శర్మ భారీ షాట్లతో భయపెట్టినా.. హర్షల్ పటేల్ అతన్ని ఔట్ చేసి ఆర్సీబీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.