మొహాలీ: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కానీ విరాట్ కోహ్లీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 59) జిడ్డు బ్యాటింగ్తో ఆర్సీబీ భారీ స్కోర్ చేయలేకపోయింది.
మొత్తం 13 డాట్ బాల్స్ ఆడిన కోహ్లీ.. స్పిన్కు చాలా ఇబ్బంది పడ్డాడు. స్పిన్ బౌలింగ్లో 21 బంతులు ఆడిన కోహ్లీ ఓ బౌండరీ సాయంతో 16 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత వచ్చిన గ్లేన్ మ్యాక్స్వెల్(0), దినేశ్ కార్తీక్(7) కూడా దారుణంగా విఫలమవడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీసారు.

అదిరిపోయే ఆరంభం..: టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. పిచ్ స్లోగా ఉండటంతో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న ఈ జోడీ.. తర్వాత ధాటిగా ఆడింది. హర్ప్రీత్ బ్రార్ వేసిన 4వ ఓవర్లో డుప్లెసిస్ రెండు సిక్స్లు బాదగా.. నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో కోహ్లీ బౌండరీ బాదడంతో ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది.
మలుపు తిప్పిన స్పిన్నర్లు.. : పవర్ ప్లే అనంతరం స్పిన్నర్లు రంగంలోకి దిగగా.. ఈ జోడీ తడబడింది. ఫాఫ్ ఎదురు దాడికి దిగే ప్రయత్నం చేసినా.. కోహ్లీ డిఫెన్స్కే పరిమితమయ్యాడు. లివింగ్ స్టోన్ వేసిన 10వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసిన ఫాఫ్ డుప్లెసిస్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సింగిల్స్కే పరిమితమవ్వడంతో ఆర్సీబీ పరుగుల వేగం తగ్గింది. ఆకాశ్ దీప్ సింగ్ వేసిన 14వ ఓవర్లో బౌండరీ బాదిన విరాట్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కార్తీక్ మళ్లీ విఫలం.. : అనంతరం ఓ భారీ సిక్సర్ బాదిన కోహ్లీ.. హర్ప్రీత్ బ్రార్ వేసిన 17వ ఓవర్లో క్యాచ్ ఔటయ్యాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 137 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి బంతికే మ్యాక్సీ కూడా ఔటవ్వగా.. డుప్లెసిస్ రెండు సిక్సర్లతో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అదే జోరులో క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్(7) ధాటిగా ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్ అయ్యాడు. చివరి ఓవర్లో హెహ్బాజ్, మహిపాల్ లోమ్రోర్ 11 పరుగుల రాబట్టడంతో ఆర్సీబీ 170 పరుగుల మార్క్ను అందుకుంది.