హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజన్లో దినేశ్ కార్తీక్ ఇప్పటి వరకు ఒక్క ఇన్నింగ్స్ కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లోనూ కీలక సమయంలో క్రీజులోకి వచ్చి చేతులెత్తేసాడు.
విధ్వంసకర బ్యాటింగ్తో జట్టుకు భారీ స్కోర్ అందించాల్సిన కార్తీక్.. మరోసారి షాట్ పిచ్ బాల్కే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లు ఆడిన దినేశ్ కార్తీక్.. 45 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు డకౌట్లు ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్తో అత్యధికంగా 28 పరుగులు చేశాడు.

ముంబై ఇండియన్స్తో డకౌటైన కార్తీక్.. కేకేఆర్తో 9 పరుగులు, లక్నోతో 1 నాటౌట్, ఢిల్లీతో 0, చెన్నైతో 28, పంజాబ్తో 7 పరుగులే చేశాడు. దినేశ్ కార్తీక్ వైఫల్యం ఆర్సీబీ విజయవకాశాలను దెబ్బతీస్తోంది. లక్ష్యచేధనలోనూ ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు కార్తీక్ కామియో ఇన్నింగ్స్ను ఆర్సీబీ మిస్సవుతోంది.
గత సీజన్లో హిట్టర్గా ఆకట్టుకున్న కార్తీక్.. తనకే సాధ్యమైన ఇన్నింగ్స్లతో జట్టుకు అద్భుత విజయాలందించాడు. ఓడిపోయే మ్యాచ్ల్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగి ఆర్సీబీని గెలిపించాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలో కూడా చోటు దక్కించుకొని టీ20 ప్రపంచకప్ కూడా ఆడాడు. మెగాటోర్నీలో దారుణంగా విఫలమైన కార్తీక్.. జట్టులో చోటు కోల్పోయి కామెంటేటర్గా తన రెండో ఇన్నింగ్స్ను కొనసాగించాడు.
ఐపీఎల్ 2023 సీజన్లోనూ అదే పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. కెరీర్లో చివరి సీజన్ ఆడుతున్న దినేశ్ కార్తీక్ పేలవ బ్యాటింగ్ చూసి సొంత అభిమానులే ఆగ్రహానికి గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. కామెంట్రీ చెప్పుకోక ఈ తిప్పలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వెంటనే రిటైర్మెంట్ ప్రకటించి యువ ప్లేయర్లకు అవకాశం కల్పించాలని హితవు పలుకుతున్నారు.
పంజాబ్తో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 84), విరాట్ కోహ్లీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీసారు.