మోహాలీ: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై సారథి రోహిత్ శర్మ తెలిపాడు. టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలని ధావన్ను అడిగానని, అతను బౌలింగ్ తీసుకోమని చెప్పాడని పేర్కొన్నాడు.
'పిచ్ బాగుంది. చేజింగ్లో మా జట్టుకు మంచి రికార్డు ఉంది. కాబట్టి మేం మా బలాలకు తగ్గట్లు ఆడటం ముఖ్యం. ఈ తరహా పిచ్లపై లక్ష్యానికి తగ్గట్లు ఆడటం చాలా సులువు. అయితే టీమ్ సమతూకంగా ఉండటం ముఖ్యం. మేం ఇప్పటికే చాలా ఐపీఎల్ మ్యాచ్లు ఆడాం. పరిస్థితులన్నీ క్షణాల్లో మారిపోతాయి.

పాయింట్స్ టేబుల్ చూస్తేనే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థమవుతోంది. జట్టుగా రాణించడంపై ఫోకస్ పెట్టడం ముఖ్యం. ప్రతీ మ్యాచ్లో తాజాగా బరిలోకి దిగడం కీలకం. ప్రణాళికలకు తగ్గట్లు ఆడటం ముఖ్యం. జట్టులో ఒక మార్పు చేశాం. మెరిడిత్ గాయపడటంతో ఆకాశ్ మద్వాల్ను జట్టులోకి తీసుకున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
గత మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్పై వేటు వేసిన ముంబై ఇండియన్స్ అతనికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఈ సీజన్లో 4 మ్యాచ్లు మాత్రమే ఆడిన అర్జున్ మూడు వికెట్లు మాత్రమే తీసాడు. ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకొని ముంబై ఓటమికి కారణమయ్యాడు. దాంతో అర్జున్ను డెత్ ఓవర్లలో ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కేవలం పవర్ ప్లే వరకే అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. దాంతో ముంబై మేనేజ్మెంట్ అర్జున్ను తప్పించింది.
మరోవైపు టాస్ గెలిస్తే తాము ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని పంజాబ్ సారథి శిఖర్ ధావన్ అన్నాడు. పిచ్లో పెద్దగా మార్పు ఉండదని, ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచితే గెలవచ్చని తెలిపాడు. ప్రశాంతంగా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. రబడా స్థానంలో షార్ట్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, నెహాల్ వదేరా, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మద్వాల్, ఆర్షద్ ఖాన్
పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్స్టోన్, జితేశ్ శర్మ(కీపర్), సామ్ కరణ్, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్