
ధాటిగా ఆడలేకపోయాం..
'కావాల్సిన పరుగులు చేయకపోవడమే మా ఓటమికి కారణం. ఈ పిచ్ బ్యాటింగ్కు ప్రతికూలంగా ఏం లేదు. పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల విజయాన్ని చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఎప్పుడైనా 150-160 పరుగులు చేస్తే మ్యాచ్లో నిలవొచ్చు. గత రెండు మ్యాచ్లుగా ఈ విషయంలో మేం విఫలమయ్యాం. కావాల్సిన పరుగులు చేయలేకపోయాం. దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పవర్ ప్లేలో వారి బౌలింగ్ ఎక్స్లెంట్. ఇషాన్ కిషన్ భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు. నేను కూడా పవర్ ప్లేలో పరుగులు చేయలేకపోయా. మేం ప్రయత్నించినా వికెట్ చాలా నెమ్మదిగా ఉండటంతో సాధ్యం కాలేదు.

అది అందరి నిర్ణయం..
గత నాలుగు మ్యాచ్ల్లో మేం పవర్ ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాం. కానీ ఈ రోజు విఫలమయ్యాం. 20 ఓవర్ల పాటు మా బ్యాటింగ్ బాగా సాగలేదు. ఈ వైఫల్యాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. టీమ్ ప్రణాళికల్లో భాగంగానే ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్లో వచ్చాడు. ఈ నిర్ణయం ఏ ఒక్కరో తీసుకున్నది కాదు. మిడిలార్డర్ వైఫల్యాన్ని అధిగమించేందుకు సమాలోచనలు చేస్తుండగా ఈ ఐడియా వచ్చింది. మిడిల్ ఓవర్లలో స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఆటగాడు ఎవరా? అని చూస్తే మాకు సూర్య కనిపించాడు . దాంతో ఈ మార్పు చేశాం. ఇక కఠిన పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్/ బౌలింగ్ చేయాలనే విషయాలను మేం వీలైనంత త్వరగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ముంబై చెత్త రికార్డు..
ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పలు చెత్త రికార్డులు నమోదు చేసింది. ఈ సీజన్లో పవర్ ప్లేలో అతి తక్కువ పరుగులు చేసిన జట్టుగా ముంబై అప్రతిష్టను మూటగట్టుకుంది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాక ఇబ్బంది పడిన ముంబై 6 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు మాత్రమే చేసింది. ఇది ఆ జట్టుకు సెకండ్ లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్. 2017లో ఇంతకన్నా తక్కువ పరుగులు చేసింది. అంతేకాకుండా డెత్ ఓవర్లలోనూ ఆ జట్టు దారుణంగా విఫలమైంది. ఐదు మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో పాటు 22 వికెట్లు చేజార్చుకుంది.

రాహుల్, గేల్ సూపర్ బ్యాటింగ్తో..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్ చేసింది. రోహిత్ శర్మ(52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 63), సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 33) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ(2/21), రవి బిష్ణోయ్(2/21) రెండేసి వికెట్లు తీయగా.. దీపక్ హుడా, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 132 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. కేఎల్ రాహుల్(52 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 60 నాటౌట్), క్రిస్ గేల్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 43 నాటౌట్) రాణించారు.


Click it and Unblock the Notifications
