మొహాలీ: ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లోనూ రోహిత్ శర్మ(0) దారుణంగా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్గా చెత్త రికార్డును నమోదు చేశాడు.
రోహిత్ శర్మతో పాటు ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌటైన జాబితాలో దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, మన్దీప్ సింగ్లు ఉన్నారు. వీరంతా ఇప్పటి వరకు 15 సార్లు డకౌటయ్యారు.

ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకమైనది. ముంబై ఇండియన్స్ తరఫున అతనికి 200వ మ్యాచ్. ఈ సీజన్లో రోహిత్ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ బాదాడు. వరుసగా 1, 21, 65, 20, 28, 44, 2, 3, 0తో దారుణంగా విఫలమయ్యాడు. రోహిత్ శర్మ వైఫల్యం ముంబై ఇండియన్స్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది.
ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. లియామ్ లివింగ్ స్టోన్(42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 77 నాటౌట్), జితేశ్ శర్మ(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగులు చేసి గెలుపొందింది. ఇషాన్ కిషన్, సూర్య సూపర్ బ్యాటింగ్కు టీమ్ డేవిడ్(19 నాటౌట్), తిలక్ వర్మ(26 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, రిషి ధావన్ తలో వికెట్ పడగొట్టారు.