
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత కొన్ని మ్యాచ్ల్లో ముందుగా బ్యాటింగ్ చేసి ఫలితాలు సాధించలేకపోయామని, అందుకే ఫీల్డింగ్ తీసుకుంటున్నట్లు పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ఈ వికెట్పై చేజింగ్ టీమ్కు అడ్వాంటేజ్ ఉందన్నాడు. మురుగన్ అశ్విన్ స్థానంలో రవిబిష్ణోయ్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు. ఇక ఈ సీజన్లో గత నాలుగు మ్యాచ్లుగా తొలుత బ్యాటింగే చేశామని, ఈ వికెట్పై డ్యూ ప్రభావం ఉండదని ఆశిస్తున్నట్లు తెలిపాడు. గత మ్యాచ్లో పిక్క పట్టేసిందని, ప్రస్తుతం నయమైందన్నాడు. జట్టులో ఎలాంటి మార్పుల్లేవని చెప్పాడు.
ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్లో ముంబై చిత్తుగా ఓడగా.. సన్రైజర్స్తో జరిగిన తమ చివరి మ్యాచ్లో పంజాబ్ ఘోర ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో హోరాహోరీ పోరు ఖాయమనిపిస్తోంది. గత సీజన్లో సూపర్ ఓవర్స్ థ్రిల్లింగ్ అందించిన ఈ జట్లు ఈ సీజన్లో ఏం చేస్తాయో చూడాలి. ఇక కృనాల్ పాండ్యా- దీపక్ హుడా మధ్య ఉండే పోరుపై సర్వత్రా ఆసక్తినెలకొంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు ఈ ఇద్దరు గొడవపడటం.. దీపక్ హుడా బరోడా టీమ్ నుంచి వేటుకు గురవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్లోనే దంచికొట్టిన దీపక్ హుడా.. ఈ మ్యాచ్లో ఎలా ఆడుతాడో చూడాలి. ముఖ్యంగా కృనాల్ బౌలింగ్ను ఎలా ఎదుర్కొంటాడనే ఆతృత అందరిలో నెలకొంది.
ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడగా.. 14 విజయాలతో ముంబైనే పై చేయిసాధించింది. పంజాబ్ 12 మ్యాచ్ల్లోనే గెలుపొందింది. గత రెండు సీజన్లలో మాత్రం ఇరు జట్లు చెరొక విజయాన్నందుకున్నాయి. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్లో తొలి మ్యాచ్ను ముంబై అలవోకగా గెలవగా.. సెకండ్ మ్యాచ్ డబల్ సూపర్ ఓవర్కు దారితీయగా.. పంజాబ్ విజయాన్నందుకుంది.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్/కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, మోయిసెస్ హెన్రీక్స్, ఫాబియన్ అలెన్, రవిబిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్షదీప్
ముంబై ఇండియన్స్: క్వింటన్ డికాక్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా