ఐపీఎల్ 2025 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. గుజరాత్ టైటాన్స్తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్ మంచి జోష్లో ఉంది. అదే జోరులో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది.
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో క్వాలిఫయర్-1లో ఓడిన పంజాబ్ కింగ్స్.. మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. లీగ్ దశలో ఇరు జట్లు ఒక సారి తలపడగా.. ముంబైపై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరోసారి అదే తరహా ప్రదర్శనతో విజయం సాధించాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది.

చాహల్ రీఎంట్రీ..?
క్వాలిఫయర్-1 మ్యాచ్లో చేసిన తప్పిదాలను క్వాలిఫయర్-2లో చేయవద్దనే ఆలోచనలో పంజాబ్ కింగ్స్ ఉంది. మణికట్టు గాయంతో క్వాలిఫయర్-1కు దూరంగా ఉన్న యుజ్వేంద్ర చాహల్.. ముంబైతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన ముషీర్ ఖాన్ స్థానంలో వైశాఖ్ విజయ్కుమార్ ఆడనున్నాడు. మిగతా జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు. ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్యతో పాటు జోష్ ఇంగ్లీస్, శ్రేయస్ అయ్యర్లు రాణిస్తే పంజాబ్కు తిరుగుండదు. బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్, కైల్ జెమీసన్, చాహల్ కీలకం కానున్నారు.
రిచర్డ్ గ్లీసన్ డౌట్..
ముంబై ఇండియన్స్ ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగనుంది. అయితే గుజరాత్తో ఎలిమినేటర్ మ్యాచ్లో రిచర్డ్ గ్లీసన్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. అతను ఆడే విషయంపై సందేహం నెలకొంది. మరోవైపు దీపక్ చామర్ సైంతం తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. సూర్యకు కూడా గాయమైనా.. అతను ఫిట్గానే ఉన్నాడని ముంబై కోచ్ తెలిపాడు. మరోసారి సమష్టిగా రాణిస్తే ముంబైకి తిరుగుండదు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నాడు.
పిచ్ రిపోర్ట్..
క్వాలిఫయర్-2లో అహ్మదాబాద్కు రెడ్ సాయిల్ పిచ్ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇక్కడ జరిగిన 7 మ్యాచ్ల్లో 6 జట్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. అయితే అహ్మదాబాద్ తీవ్ర ఉక్కపోత ఉండనుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, రిచర్డ్ గ్లీసన్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అశ్వని కుమార్.
పంజాబ్ కింగ్స్: ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లీస్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినీస్, అర్ష్దీప్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జెమీసన్, యుజ్వేంద్ర చాహల్/హర్ప్రీత్ బ్రార్, వైశాఖ్ విజయ్ కుమార్.