
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో పంజాబ్ కింగ్స్ తమ పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. కేఎల్ రాహుల్(52 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 60 నాటౌట్), క్రిస్ గేల్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 43 నాటౌట్) సూపర్ బ్యాటింగ్తో రెండో విజయాన్నందుకుంది. ముంబై ఇండియన్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన పంజాబ్ 9 వికెట్లతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్ చేసింది.
రోహిత్ శర్మ(52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 63), సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 33) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ(2/21), రవి బిష్ణోయ్(2/21) రెండేసి వికెట్లు తీయగా.. దీపక్ హుడా, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 132 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. రాహుల్, గేల్కు తోడుగా మయాంక్ అగర్వాల్ రాణించాడు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు 132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్(25) మంచి శుభారంభాన్ని అందించారు. బ్యాటింగ్కు ప్రతికూలంగా మారిన పిచ్పై ఓపికగా ఆడుతూ బౌండరీలు బాదారు. దాంతో పంజాబ్ పవర్ప్లేలో వికెట్ నష్టపోకుండా 45 రన్స్ చేసింది.
క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రాహుల్ చాహర్ విడదీసాడు. మయాంక్ అగర్వాల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఫస్ట్ వికెట్కు నమోదైన 53 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి యూనివర్స్ బాస్ రాగా.. రాహుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు మంచి బంతులను గౌరవిస్తూ వీలుచిక్కిన బాల్స్ను బౌండరీలకు తరలించారు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో బంతికి సింగిల్ తీసిన కేఎల్ రాహుల్ 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఆ మరుసటి ఓవర్లో గేల్ సిక్స్ కొట్టగా.. రాహుల్ 6, 4తో మ్యాచ్ను ముగించాడు.