ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్తో గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది. జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయిట్జీ సంచలన బౌలింగ్తో హార్దిక్ సేన ఓటమి నుంచి గట్టెక్కింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 78) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. రోహిత్ శర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 36), తిలక్ వర్మ(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33 నాటౌట్) మెరుపులు మెరిపించారు.

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, సామ్ కరణ్ రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. అషుతోష్ శర్మ(28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. శశాంక్ సింగ్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/21), గెరాల్డ్ కోయిట్జీ(3/32) మూడేసి వికెట్లు తీయగా..ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు.
రఫ్ఫాడించిన బుమ్రా..
193 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓవైపు జస్ప్రీత్ బుమ్రా, మరోవైపు గెరాల్డ్ కోయిట్జీ నిప్పులు చెరగడంతో పంజాబ్ కింగ్స్ టాప్-4 బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. తొలి ఓవర్లోనే ప్రభ్ సిమ్రాన్ సింగ్(0)ను ఇషాన్ కిషన్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో కోయిట్జీ పెవిలియన్ చేర్చగా.. రెండో ఓవర్లో రిలీ రోసౌ(1)ను బుమ్రా స్టన్నింగ్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఆ వెంటనే సామ్ కరణ్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్లోనే కోయిట్జీ.. లివింగ్స్టోన్(1)ను రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పంజాబ్ కింగ్స్ 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన హర్ప్రీత్ సింగ్, శశాంక్ సింగ్ ఆచితూచి ఆడారు.

ఆదుకున్న శశాంక్..
దాంతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో 4 వికెట్లకు 40 పరుగులు చేసింది. స్పిన్నర్ శ్రేయస్ గోపాల్.. హర్ప్రీత్ సింగ్(13)ను రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పంజాబ్ 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. జితేశ్ శర్మ(9) నిరాశపరిచాడు. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో అషుతోష్ శర్మతో కలిసి శశాంక్ సింగ్ చెలరేగాడు.

అషుతోష్ విధ్వంసం
భారీ షాట్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అషుతోష్ సైతం బ్యాట్కు పనిచెప్పడంతో పంజాబ్ 100 పరుగుల మార్క్ను ధాటగలిగింది. హాఫ్ సెంచరీకి చేరువైన శశాంక్ సింగ్(41)ను ఔట్ చేసిన బుమ్రా... కోలుకోలేని దెబ్బతీసాడు. హర్ప్రీత్ బ్రార్ సాయంతో అషుతోష్ శర్మ ఒంటరి పోరాటం చేశాడు.
ఓవైపు వికెట్లు పడినా.. మరోవైపు తనదైన హిట్టింగ్తో చెలరేగాడు. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్లో అషుతోష్ రెండు సిక్సర్లు.. హర్ప్రీత్ బ్రార్ ఓ సిక్సర్ కొట్టి 24 పరుగులు పిండుకున్నారు. తర్వాతి ఓవర్ను బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 3 పరుగులే వచ్చాయి.
దాంతో ఒత్తిడికి గురైన అషుతోష్ శర్మ.. కోయిట్జీ బౌలింగ్లో తొలి బంతికే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అతని వికెట్తో మ్యాచ్పై ముంబై ఇండియన్స్ పట్టు బిగించింది. చివరి 12 బంతుల్లో పంజాబ్ విజయానికి 23 పరుగులు అవసరమవ్వగా.. 19వ ఓవర్ వేసిన హార్దిక్ ఓ వికెట్ తీసి 11 పరుగులిచ్చాడు. దాంతో ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 12 పరుగులు అవసరమయ్యాయి. అయితే క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో రబడా ఔటవ్వడంతో ముంబై విజయం సాధించింది.