
పుణే: ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయాన్నందుకుంది. పంజాబ్ కింగ్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన లక్నో 20 పరుగుల తేడాతో గెలుపొందింది. బౌలింగ్లో సత్తా చాటిన పంజాబ్ మరోసారి పేలవ బ్యాటింగ్తో మూల్యం చెల్లించుకుంది. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46), దీపక్ హుడా(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 34) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో రబడా నాలుగు వికెట్లతో చెలరేగగా రాహుల్ చాహర్ రెండు, సందీప్ శర్మ ఓ వికెట్ తీసాడు.
అనంతరం పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. జానీ బెయిర్ స్టో(28 బంతుల్లో 5 ఫోర్లతో 32) మయాంక్ అగర్వాల్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 25), రిషి ధావన్(21 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో మోహ్సిన్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. చమీరా, కృనాల్ పాండ్యా రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్కు ఓ వికెట్ దక్కింది.

154 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(25), శిఖర్ ధావన్ వెనువెంటనే పెవిలియన్ చేరారు. దుష్మంత్ చమీరా బౌలింగ్లో మయాంక్ క్యాచ్ ఔటవ్వగా.. ధావన్ను రవి బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే భానుక రాజపక్స(9)ను కృనాల్ పాండ్యా పెవిలియన్ చేర్చగా.. లివింగ్ స్టోన్(18)తో కలిసి జానీ బెయిర్ స్టో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ లివింగ్ స్టోన్ మోహ్సీన్ ఖాన్ ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసారు.
ఆ వెంటనే జితేశ్ శర్మ(2)ను కృనాల్ వికెట్ల ముందు బోల్తాకొట్టించగా.. జానీ బెయిర్ స్టోను చమీరా పెవిలియన్ చేర్చాడు. రిక్వైర్డ్ రన్ రేట్ పెరగడంతో భారీ షాట్లకు ప్రయత్నించిన రబడా (2), రాహుల్ చాహర్(4) పెవిలియన్ చేరారు. చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి 31 పరుగులు అవసరమవ్వగా.. రిషి ధావన్ 6, 4తో ఆశలు రేకెత్తించాడు. అయితే ఆ తర్వాతి నాలుగు బంతులను ఆవేశ్ ఖాన్ కట్టుదిట్టంగా వేసి ఒక్క పరుగు ఇవ్వలేదు. దాంతో లక్నో విజయం లాంఛనమైంది.