మొహాలీ: ఐపీఎల్ 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. కోల్కతా నైట్రైడర్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 7 పరుగులతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల చేసింది.
భానుక రాజపక్స(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ శిఖర్ ధావన్(29 బంతుల్లో 6 ఫోర్లతో 40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ పడగొట్టారు.

కొంపముంచిన వరణుడు..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేయగా వర్షం అంతరాయం కలిగించింది. దాంతో అంపైర్లను ఆటను నిలిపివేయగా.. క్రీజులో శార్దూల్ ఠాకూర్(8 బ్యాటింగ్), సునీల్ నరైన్(7 బ్యాటింగ్) ఉన్నారు. కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉండగా.. డకవర్త్ లూయిస్ లెక్కల ప్రకారం పంజాబ్ కంటే కేకేఆర్ 7 పరుగుల వెనుకంజలో నిలిచింది. వర్షం ఆగకపోవడంతో అంపైర్లు పంజాబ్ను విజేతగా ప్రకటించారు.
ఒకవేళ వర్షం రాకుంటే కేకేఆర్కు గెలిచే అవకాశాలు ఉండేవి. ఆ జట్టు విజయానికి ఓవర్కు 12 పరుగులు చేయాల్సి ఉండగా.. క్రీజులో నరైన్, శార్దూల్ ఉన్నారు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడితే కేకేఆర్కు విజయం దక్కేది.
శుభారంభం లేదు..
192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మన్దీప్ సింగ్(2), అనుకూల్ రాయ్(4)లను అర్ష్దీప్ సింగ్ పెవిలియన్ చేర్చగా.. ధాటిగా ఆడిన రెహ్మానుల్లా గుర్బాజ్(22)ను ఎల్లీస్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో కేకేఆర్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 46 పరుగులు మాత్రమే చేసింది.
ఇంపాక్ట్ ప్లేయర్గా వెంకటేశ్..
ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్తో కలిసి కెప్టెన్ నితీశ్ రాణా పోరాడగా.. సికిందర్ రాజా దెబ్బ తీసాడు. నితీశ్ రాణా(24)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి నాలుగో వికెట్కు నమోదైన 46 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ మరుసటి ఓవర్లోనే రింకూ సింగ్(4) ఔటవ్వడంతో కేకేఆర్ 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
రస్సెల్ చెలరేగినా..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్ తనదైన శైలిలో చెలరేగాడు. 2 భారీ సిక్సర్లతో పాటు 3 బౌండరీలతో ఆశలు రేకెత్తించాడు. కానీ రస్సెల్ను సామ్ కరన్ బోల్తా కొట్టించడంతో 6వ వికెట్కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ వెంటనే వెంకటేశ్ అయ్యర్ కూడా ఔటవ్వడంతో కేకేఆర్ ఓటమి ఖాయామైంది. కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 46 పరుగులు కావాల్సిన సమయంలో వర్షం ఆటను అడ్డుకుంది.