సన్రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన షాక్ నుంచి పంజాబ్ కింగ్స్ ఇంకా కోలుకోలేదు. అభిషేక్ శర్మ విధ్వంసానికి 245 పరుగుల భాగస్వామ్యాన్ని కాపాడుకోలేక ఓటమికి తల వంచిన పంజాబ్ కింగ్స్.. సొంతగడ్డపై కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో దారుణంగా విఫలమైంది. కేకేఆర్ బౌలర్లు హర్షిత్ రాణా(3/25), సునీల్ నరైన్(2/14), వరుణ్ చక్రవర్తీ(2/21) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది.
ప్రియాంశ్ ఆర్య(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22), ప్రభ్సిమ్రాన్ సింగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ రెండేసి వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ పడగొట్టారు.

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ను ఓపెనర్లు దూకుడుగానే ప్రారంభించారు. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ భారీ షాట్లతో చెలరేగారు. అయితే ప్రియాన్ష్ ఆర్యను హర్షిత్ రాణా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 39 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(0)ను కూడా హర్షిత్ రాణా క్యాచ్ ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లో జోష్ ఇంగ్లీస్(2)ను వరుణ్ చక్రవర్తీ బౌల్డ్ చేయగా.. హర్షిత్ రాణా తన మరుసటి ఓవర్లో దూకుడుగా ఆడుతున్న ప్రభ్సిమ్రాన్ సింగ్(30)ను క్యాచ్ ఔట్ చేశాడు.
హర్షిత్ రాణా తీసిన మూడు వికెట్ల క్యాచ్లను రమణ్దీప్ సింగ్ అందుకోవడం విశేషం. దాంతో పవర్ ప్లేలోనే పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం నెహాల్ వధేరా(10)ను అన్రిచ్ నోర్జ్ ఔట్ చేయగా.. పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. గ్లేన్ మ్యాక్స్వెల్(7)ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేయగా.. సుయాన్ష్ షెద్గే(4), మార్కో జాన్సెన్(1)లను సునీల్ నరైన్ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. ఆచితూచి ఆడిన శశాంక్ సింగ్(18) పంజాబ్ కింగ్స్ జట్టు స్కోర్ను 100 పరుగులు ధాటించాడు. అయితే అతన్ని వైభవ్ అరోరా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అదే ఓవర్లో గ్జేవియర్ బార్ట్లెట్(11) రనౌటవ్వడంతో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది.