మొహాలీ: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఫిట్నెస్ సమస్యలతో గత మ్యాచ్కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా.. ఈ మ్యాచ్తో రీ ఎంట్రీ ఇచ్చాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ బౌలింగ్కు అనుకూలంగా ఉన్నట్లుంది. ఈ పిచ్పై చేజింగ్ ఈజీ అవ్వనుంది. గత ఓటమిని మరిచిపోయాం. ఆ మ్యాచ్లో కూడా చివరి ఓవర్ వరకు అద్భుతంగా ఆడాం. క్రికెట్లో ఇలాంటి ఫలితాలు సహజం. ఈ మ్యాచ్కు ఫ్రెష్గా బరిలోకి దిగుతున్నాం. తుది జట్టు మార్పుల గురించి నాకు తెలియదు. టీమ్ వివరాలు పేపర్లో ఉన్నాయి.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

కేకేఆర్ హిట్టర్ రింకూ సింగ్ దెబ్బకు చివరి ఓవర్లో ఐదు సిక్స్లు సమర్పించుకున్న యశ్ దయాల్పై గుజరాత్ టీమ్మేనేజ్మెంట్ వేటు వేసింది. అతని స్థానంలో మోహిత్ శర్మకు అవకాశం కల్పించింది.
టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. గత మ్యాచ్ ఓటమిపై స్పందిస్తూ.. క్రికెట్లో గెలుపు ఓటములు సహజమని, ఫలితాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నాడు. జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన ధావన్.. నాథన్ ఎల్లిస్ స్థానంలో రబడా, సికిందర్ రాజా ప్లేస్లో సికిందర్ రాజా జట్టులోకి వచ్చారని చెప్పాడు.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ(కీపర్), సామ్ కరన్, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబడా, రిషి ధావన్, అర్ష్దీప్ సింగ్
గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా(కీపర్), శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జోషువా లిటిల్