
ముంబై: లియామ్ లివింగ్ స్టోన్(27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 64) మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ టైటాన్స్ ముందు పంజాబ్ కింగ్స్ 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్కు అండగా.. శిఖర్ ధావన్(30 బంతుల్లో 4 ఫోర్లతో 35), జితేశ్ శర్మ(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 23), రాహుల్ చాహర్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. దర్శన్ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, ఫెర్గూసన్, హార్దిక్ తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5) ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే హార్థిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో(8) 2 బౌండరీలతో జోరు కనబర్చినా.. ఫెర్గూసన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దాంతో పంజాబ్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 43 పరుగులే చేసింది. ఇక 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లివింగ్ స్టోన్కు లైఫ్ లభించింది. లెగ్ సైడ్ అతను కొట్టిన భారీ షాట్ను బౌండరీ లైన్ వద్ద హార్దిక్ అద్భుతంగా అందుకున్నప్పటికీ.. అతని కాలు బౌండరీ లైన్కు తాకడంతో సూపర్ క్యాచ్ కాస్త సిక్సర్గా మారింది. ఈ అవకాశంతో చెలరేగిన లివింగ్ స్టోన్.. రాహుల్ తెవాటియా బౌలింగ్లో భారీ సిక్సర్తో 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ తర్వాత కూడా అదే జోరు కనబర్చగా.. రషీద్ ఖాన్ అతనికి కళ్లెం వేసాడు. మిల్లర్ సూపర్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే షారూఖ్ ఖాన్ను కూడా రషీద్ ఔట్ చేయగా.. కగిసో రబడాను షమీ రనౌట్ చేశాడు. ఇక క్రీజులోకి వచ్చి వైభవ్ అరోరా కూడా ఔటవ్వడంతో పంజాబ్ ఆలౌట్ దిశగా సాగింది. కానీ చివరి వికెట్కు రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్ విలువైన పరుగులు జోడించడంతో భారీ స్కోర్ చేయగలిగింది.