మొహాలీ: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్(24 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 36), జితేశ్ శర్మ(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. షమీ, జోష్ లిటిల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్(0), శిఖర్ ధావన్(0) దారుణంగా విఫలమయ్యారు. షమీ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే ప్రభ్సిమ్రాన్ క్యాచ్ ఔటవ్వగా.. జోష్ లిటిల్ వేసిన నాలుగో ఓవర్లో ధావన్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స ధాటిగా ఆడారు. దాంతో పంజాబ్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది.

పవర్ ప్లే ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా తన ట్రంప్ కార్డ్ రషీద్ ఖాన్ను తీసుకొచ్చి ఫలితం రాబట్టాడు. దూకుడుగా ఆడుతున్న మాథ్యూ షార్ట్ను రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. మోహిత్ శర్మ ఔట్ చేశాడు.
ఆ కొద్దిసేపటికే భానుక రాజపక్స(20)ను అల్జారీ జోసెఫ్ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన షారూఖ్ ఖాన్ భారీ సిక్సర్ బాదాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో సామ్ కరణ్(22) కూడా వెనుదిరిగాడు. చివర్లో హర్ప్రీత్ బ్రార్, షారూఖ్ ఖాన్(21) భారీ షాట్లు ఆడటంతో పంజాబ్ 150 పరుగుల మార్క్ను అందుకుంది.