ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వర్షం కారణంగా ఇంకా టాస్ కూడా వేయలేదు. సరిగ్గా మ్యాచ్ ప్రారంభ సమయానికి వర్షం రావడంతో టాస్ సాధ్యం కాలేదు. మైదాన సిబ్బంది.. గ్రౌండ్ను పూర్తిగా కవర్లతో కప్పి వేసారు. ప్రస్తుతం ధర్మశాలలో భారీ వర్షం కురుస్తోంది. అక్కడి పరిస్థితులను చూస్తుంటే.. ఈ మ్యాచ్ జరగడం సందేహంగా అనిపిస్తోంది. ఇప్పటికే ఈ సీజన్లో రెండు మ్యాచ్లు రద్దయ్యాయి.
మరో మ్యాచ్లో వర్షం అంతరాయం కలిగించినా.. ఫలితం వచ్చింది. టోర్నీ రూల్స్ ప్రకారం కటాఫ్ టైమ్ వరకు వేచి చూస్తారు. ఈ మ్యాచ్లో ఫలితం తేలాలంటే కనీసం ఇరు జట్ల మధ్య 5 ఓవర్ల మ్యాచ్ జరగాలి. ఈ మ్యాచ్ రద్దయితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి.

ఇప్పటికే ఆ జట్టు ఆడాల్సిన ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. సన్రైజర్స్ హైదరాబాద్తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ 6 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 13 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్తో మ్యాచ్ రద్దయితే ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్స్ చేరుతాయి. అప్పుడు చివరి రెండు మ్యాచ్లకు రెండు గెలవాల్సి ఉంటుంది. ఒకటి గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మరోవైపు ఈ మ్యాచ్ రద్దయినా పంజాబ్ కింగ్స్ పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదు. ప్రస్తుతం ఆ జట్టు 15 పాయింట్స్తో మూడో స్థానంలో కొనసాగుతోంది.