
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయాన్నందుకుంది. జట్టులో కరోనా వైరస్ కలకలం రేపినా వారి ప్రదర్శనపై మాత్రం ప్రభావం చూపలేదు. బౌలింగ్, బ్యాటింగ్లో సమష్టిగా రాణించి 9 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. యువ ప్లేయర్ జితేశ్ శర్మ(23 బంతుల్లో 5 ఫోర్లు 32), మయాంక్ అగర్వాల్(15 బంతుల్లో 4 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 10.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 119 పరుగులు చేసి 57 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 60 నాటౌట్), పృథ్వీ షా(20 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 41) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. ఈ ఇద్దరి ధాటైన బ్యాటింగ్కు ఢిల్లీ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం హాఫ్ సెంచరీకి చేరువైన పృథ్వీ షాను రాహుల్ చాహర్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి సర్ఫరాజ్ ఖాన్(12) రాగా.. వార్నర్ ధాటిగా ఆడి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో నాథన్ ఎల్లిస్ వేసిన 10వ ఓవర్లో బౌండరీ బాది 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్ చాహర్ వేసిన మరుసటి ఓవర్లో బౌండరీ బాదిన వార్నర్.. మ్యాచ్ను ముగించాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోర్, త్వరగా ముగిసిన మ్యాచ్.