బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్.. ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పాడు.
జట్టులో చాలా మంది ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నారని, తుది జట్టులో ఎవరిని ఆడించాలో తెలియలేదని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ విజయం సాధించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. 'ఈ వికెట్ నెమ్మదిగా ఉందని ప్రతీ ఒక్కరు గుర్తించారు. లో బౌన్స్ కూడా ఉంది. మాకు దక్కిన ఆరంభం తర్వాత మేం 180-200 పరుగులు చేస్తామనుకున్నా.

కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఈ వికెట్పై 160-170 పరుగులు కూడా పోరాడే లక్ష్యమని భావించాం. సిమర్జీత్ సింగ్ ఏం చేశాడో నాకు తెలియదు. కానీ ప్రీ సీజన్ ముందు అతను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసేవాడు. అయితే అతనికి ఆడే అవకాశం రాలేదు. సరైన సమయంలో అవకాశం ఇవ్వగా.. అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
వాస్తవానికి మేం ఇంపాక్ట్ ప్లేయర్గా ఎక్స్ట్రా బ్యాటర్ను ఆడించాలనుకున్నాం. కానీ మహా అయితే అతను 10-15 పరుగులు మాత్రమే చేయగలడు. అదే బౌలర్ అయితే 2-3 వికెట్లు తీయగలడని మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. జట్టులో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఉదయం ఎవర్నీ ఆడించాలనేది కూడా మాకు అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు విజయం దక్కడం సంతోషంగా ఉంది.'అని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 46) టాప్ స్కోరర్. రుతురాజ్ గైక్వాడ్ (21 బంతుల్లో, 4 ఫోర్లు, సిక్స్తో 32), డారిల్ మిచెల్ (19 బంతుల్లో, 2 ఫోర్లు, సిక్స్తో 30) కీలక పరుగులు సాధించారు.
శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్కు చేరారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24)తలో మూడు వికెట్లతో సత్తాచాటారు.
అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసి ఓటమిపాలైంది. ప్రభ్సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30), శశాంక్ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా (3/20) మూడు, సిమర్జీత్ సింగ్ (2/16), తుషార్ దేశ్పాండే (2/35) చెరో రెండు వికెట్లు తీశారు.