ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్లతో 103) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్యకు తోడుగా శశాంక్ సింగ్(36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు.
మార్కో జాన్సెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/45), రవిచంద్రన్ అశ్విన్(2/48) రెండేసి వికెట్లు తీయగా.. ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓవైపు ప్రియాన్ష్ ఆర్య తొలి బంతినే సిక్సర్గా తరలించి తమ ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించాడు. అయితే రెండో బంతికే అతను ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను ఖలీల్ అహ్మద్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను ఐదో బంతిని సిక్సర్గా తరలించాడు. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(0)ను ముఖేష్ చౌదరి బౌలింగ్లో డకౌటయ్యాడు.
వరుస ఓవర్లలో శ్రేయస్ అయ్యర్(9), మార్కస్ స్టోయినీస్(4)లను ఖలీల్ అహ్మద్ ఔట్ చేయగా.. నెహాల్ వధేరా(9), గ్లేన్ మ్యాక్స్వెల్(1)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో పంజాబ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ప్రియాన్ష్ ఆర్య చెలరేగాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శశాంక్ సింగ్తో కలిసి మరింత దూకుడుగా ఆడిన ప్రియాన్ష్ ఆర్య.. 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని నూర్ అహ్మద్ ఔట్ చేయగా.. మార్కో జాన్సెన్తో కలిసి శశాంక్ సింగ్ చెలరేగాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.