కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అండగా నిలవడంతోనే సెంచరీ చేయగలిగానని పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య తెలిపాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమైనా.. అయ్యర్ వెన్ను తట్టి ప్రోత్సహించాడని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ప్రియార్ష్ ఆర్య(42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్లతో 103) సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ప్రియాన్ష్ ఆర్య.. 39 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన నాలుగో బ్యాటర్గా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ప్రియాన్ష్ ఆర్య భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతని అద్భుత బ్యాటింగ్తో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రియాన్ష్ ఆర్యకు తోడుగా శశాంక్ సింగ్(36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. మార్కో జాన్సెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/45), రవిచంద్రన్ అశ్విన్(2/48) రెండేసి వికెట్లు తీయగా.. ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.

అయ్యర్ వల్లే..
పంజాబ్ ఇన్నింగ్స్ అనంతరం బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన ప్రియాన్ష్ ఆర్య.. తన సెంచరీ క్రెడిట్ను తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు ఇచ్చాడు. 'నేను భావాలను వ్యక్తపరచలేను. కానీ లోపల చాలా సంతోషంగా ఫీలవుతున్నా. గత మ్యాచ్ వైఫల్యం అనంతరం శ్రేయస్ అయ్యర్ ప్రత్యేకంగా నాతో మాట్లాడాడు. బలాలను నమ్ముకొని ఆడాలని సూచించాడు. నచ్చినట్లు స్వేచ్చగా ఆడాలని చెప్పాడు. తొలి బంతి అయినా సరే నా స్లాట్ పడితే సిక్స్ కొడుతాను. వీలైనంత ఎక్కువగా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఐపీఎల్ కంటే డీపీఎల్ సులువైనది. ఈ వికెట్పై బంతి బ్యాట్పైకి చక్కగా వస్తుంది. పెద్దగా టర్న్ కూడా లభించడం లేదు. కాబట్టి పవర్ ప్లేలోనే వికెట్లు తీయాలి'అని ప్రియాన్ష్ ఆర్య చెప్పుకొచ్చాడు.
ఎవరీ ప్రియాన్ష్ ఆర్య?
ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య.. తల్లిదండ్రులు వృత్తి రీత్యా టీచర్లు. ప్రియాన్ష్ ఆర్య సరదాగా స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడేవాడు. ఆటపై ఉన్న మక్కువను గమనించిన అతని తండ్రి సంజయ్ భరద్వాజ్ కోచింగ్ అకాడమీలో చేర్పించాడు. అక్కడే బ్యాటింగ్ నేర్చుకున్న ప్రియాన్ష్ ఆర్య.. గంభీర్ పర్యవేక్షణలో మరింత రాటు దేలాడు. అతని ఆటకు ఫిదా అయిన గంభీర్.. ప్రియాన్ష్ ఆర్యకు క్రికెట్ కిట్ కూడా గిఫ్ట్గా ఇచ్చాడు.
ఢిల్లీ తరఫున ఏజ్ క్రికెట్ ఆడిన ప్రియాన్ష్.. 2021లో దేశవాళీ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. 2023లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు స్పిన్నర్లు, కర్ణాటక పేసర్లను చితక్కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరుసటి ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 176.63 స్ట్రైక్రేట్తో 325 పరుగులు చేశాడు. 43 బంతుల్లోనే 102 పరుగులు చేసి టాక్ ఆఫ్ ది నేషన్గా నిలిచాడు
ఒకే ఓవర్లో 6 సిక్స్లు..
ఆ తర్వాత ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు బాది దేశంలోని క్రికెట్ అభిమానులను తనవైపు తిప్పుకున్నాడు. ఈ టోర్నీలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్కు ఆడిన ప్రియాన్ష్.. 608 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఓ మ్యాచ్లో ఆయుష్ బదోనితో కలిసి 286 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.