ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్ మంగళవారం మల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో సీఎస్కే 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డెవాన్ కాన్వే స్లో బ్యాటింగ్తో పాటు కీలక సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ(12 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 27) ఔటవ్వడం చెన్నై సూపర్ కింగ్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్లతో 103) సెంచరీతో చెలరేగగా.. శశాంక్ సింగ్(36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. మార్కో జాన్సెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/45), రవిచంద్రన్ అశ్విన్(2/48) రెండేసి వికెట్లు తీయగా.. ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులే చేసి ఓటమిపాలైంది. డెవాన్ కాన్వే(49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 69) హాఫ్ సెంచరీతో రాణించగా.. శివమ్ దూబే(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 42), రచిన్ రవీంద్ర(23 బంతుల్లో 6 ఫోర్లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్(2/40) రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ మ్యాక్స్వెల్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.
భారీ లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తమ ఇన్నింగ్స్ను నిదానంగా ప్రారంభించింది. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో సీఎస్కే వికెట్ నష్టపోకుండా 59 పరుగులే చేసింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన మ్యాక్స్వెల్.. రచిన్ రవీంద్ర(36)ను స్టంపౌట్గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(1)ను లాకీ ఫెర్గూసన్ క్యాచ్ ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో శివమ్ దూబే, డెవాన్ కాన్వే ఇన్నింగ్స్ను నడిపించారు.
ఈ ఇద్దరూ భారీ సిక్సర్లతో విరుచుకపడటంతో సీఎస్కే స్కోర్ బోర్డు పరుగెత్తింది. అయితే దూకుడుగా ఆడుతున్న శివమ్ దూబేను ఫెర్గూసన్ క్లీన్ బౌల్డ్ చేసి మూడో వికెట్కునమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. క్రీజులోకి ధోనీ రాగా.. భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడిన డెవాన్ కాన్వే రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగాడు.
ధోనీ మూడు సిక్సర్లతో ఆశలు రేకెత్తించినా.. పంజాబ్ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. చివరి ఓవర్లో సీఎస్కే విజయానికి 28 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికే ధోనీ వెనుదిరిగాడు. దాంతో పంజాబ్ విజయం లాంఛనమైంది. జడేజా భారీ సిక్సర్ కొట్టినా ఫలితం లేకపోయింది. సీఎస్కే బ్యాటింగ్ అప్రోచ్ దూకుడుగా లేకపోవడం ఆ జట్టు పతనాన్ని శాసించింది. డెవాన్ కాన్వే కాస్త దూకుడుగా ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేది.