
అపెక్స్ కౌన్సిల్లో..
ముంబై వేదికగా గురువారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు బిజినెస్ వర్గాలు పేర్కొన్నాయి. భారత్లో జరిగే సిరీస్లకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న పేటీఎం.. రూ. 326.80 కోట్లతో 2019 లో నాలుగేండ్ల పాటు (2023) వరకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ మరో ఏడాది గడువు ఉండగానే పేటీఎం మాత్రం బీసీసీఐతో సంబంధాలు తెంచుకోవాలని భావిస్తోంది. తాము టైటిల్ స్పాన్సర్ నుంచి తప్పుకుంటామని బీసీసీఐకి సమాచారమందించినట్టు తెలుస్తున్నది.
తమ డీల్ను 'మాస్టర్ కార్డ్' కు మళ్లించాలని కూడా ప్రతిపాదన పెట్టినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. 'అవును. వాళ్లు (పేటీఎం) తమ హక్కులను మాస్టర్ కార్డ్కు మళ్లించమని రిక్వెస్ట్ చేశారు. వాళ్లకు ఆ హక్కు ఉంది. కానీ అది జులై 1 కంటే ముందు చేసి ఉంటే బాగుండేది.'అని తెలిపారు.

2015లో తొలిసారిగా..
2015లో పేటీఎం తొలిసారి టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించింది. 2019లో ఈ డీల్ను నాలుగేళ్ల పాటు పునరుద్దరించుకుంది. డీల్ ఒప్పందం రూ. 326.80 కోట్లు. 2019 వరకు మ్యాచ్ కు రూ. 2.4 కోట్ల ఉన్న విలువను 2019 తర్వాత రూ. 3.80 కోట్లకు పెంచి మరీ హక్కులు దక్కించుకున్న పేటీఎం అర్థాంతరంగా స్పాన్సర్షిప్ నుంచి వైదొలగాలని ప్రతిపాదించడం గమనార్హం.

బైజూస్ కూడా...
టీమిండియా జెర్సీ స్పాన్సర్ అయిన బైజూస్ తో కూడా బీసీసీఐకి సంబంధాలు గొప్పగా ఏం లేవని తెలుస్తున్నది. 2022 జులై నాటికి బైజూస్.. బీసీసీఐకి రూ. 86.21 కోట్ల బాకీ ఉన్నట్టు తెలుస్తున్నది. అంతకుముందు మార్చి 2022 నాటికి చెల్లించాల్సి ఉన్న రూ. 22.22 కోట్లను కూడా బైజూస్ చెల్లించలేదని సమాచారం. దీనిపై కూడా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ లో చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.

ఇదేం కొత్త కాదు..
స్పాన్సర్లు మధ్యలోనే తప్పుకోవడం బీసీసీఐకి ఇదే కొత్త కాదు. గతంలో ఒప్పో (టీమ్ జెర్సీ) కూడా మధ్యలోనే తమ ఒప్పందాన్ని కాదనుకుంది. ఇక ఐపీఎల్-2021 రెండో అర్థభాగంలో టైటిల్ స్పాన్సర్ వివో కూడా ఈ డీల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ స్థానంలో టాటా వచ్చి చేరింది. ఒప్పో స్థానాన్ని బైజూస్ భర్తీ చేస్తున్నది.


Click it and Unblock the Notifications
