టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్పై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియాలో మ్యాచ్ను మలుపు తిప్పగల ఆటగాడు రిషభ్ పంత్ అని కొనియాడాడు. సుమారు 20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రిషభ్ పంత్ రెడ్ బాల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్తో సుదీర్ఘ ఫార్మాట్లోకి పునరాగమనం చేసిన పంత్.. సెంచరీతో సత్తా చాటాడు. ఈ మెరుపు శతకంతో ఆస్ట్రేలియా జట్టుకు హెచ్చరికలు పంపాడు. కారు యాక్సిండెంట్ అనంతరం తొలి టెస్టులోనే సెంచరీతో అదరగొట్టిన పంత్.. 'నేను మళ్లీ వస్తున్నా. కాచుకోండి' అంటూ కంగారూలకు సవాల్ విసిరాడు.

ఈ ఏడాది నవంబర్లో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్ గురంచి ఇరు జట్ల మాజీ క్రికెటర్లు తమ మాటలతో హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా రిషభ్ పంత్ బ్యాటింగ్ గురించి మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ .. ఈ సారి అతన్ని నిశబ్దంగా ఉంచే ప్రయత్నం చేస్తామని చెప్పాడు.
అతడికి ఏమాత్రం అవకాశం ఇవ్వమని అన్నాడు. 'మ్యాచ్ను మలుపు తిప్పగల ఆటగాళ్లు ప్రతి జట్టులో ఒకరో ఇద్దరో ఉంటారు. మా టీమ్లో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్లు అలా దూకుడుగా ఆడి మ్యాచ్ను లాగేసుకుంటారు. రిషభ్ పంత్ కూడా అలాంటి ఆటగాడే. అతను ఆడే రివర్స్ స్లాప్ షాట్ చాలా ప్రత్యేకం. అతను ఈ మధ్య సూపర్ ఫామ్లో ఉన్నాడు. అయితే.. ఈసారి మేము అతన్ని నిశబ్దంగా మారుస్తాం. అతనికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుకు కళ్లెం వేస్తాం' అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పాడంటే ఆ పని చేస్తాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్లో అహ్మదాబాద్ అభిమానులను నిశబ్దంగా మార్చేస్తానని తుది పోరుకు ముందు చెప్పాడు. అన్నట్టుగానే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ల వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు. ఆ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది. ట్రావిస్ హెడ్(137), మార్నస్ లబూషేన్(58 నాటౌట్)లు దంచికొట్టడంతో ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది ఛాంపియన్గా నిలిచింది.
అయితే ఆస్ట్రేలియా పర్యటన అంటే రిషభ్ పంత్కు పూనకాలు వస్తాయి. ఆసీస్ గడ్డ మీద అతనికి మంచి రికార్డులు ఉన్నాయి. 2020-21లో కంగారూ గడ్డపై పంత్ ఖతర్నాక్ బ్యాటింగ్తో భారత్ను గెలిపించాడు. గబ్బా టెస్టులో అర్ధ శతకం (89 నాటౌట్)తో టీమిండియాను గెలిపించి సరికొత్త చరిత్రను లిఖించాడు. ఇక సిడ్నీ టెస్టులోనూ ఛతేశ్వర్ పూజారాతో కలిసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, భారత జట్టు 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది.
ఇప్పుడు.. మరోసారి టీమిండియా నవంబర్లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. నవంబర్ 22న ఇరు జట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. 1992 తర్వాత బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ ఐదు మ్యాచ్ల సిరీస్గా నిర్వహించడం ఇదే తొలిసారి.