టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్తోనే మెల్బోర్న్ టెస్ట్పై పట్టు సాధించామని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. రెండో ఇన్నింగ్స్లో అతని వికెట్ తమకు కీలకమైందన్నాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సోమవారం ముగిసిన మెల్బోర్న్ టెస్ట్లో ఆస్ట్రేలియా 184 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో(82, 84) యశస్వి జైస్వాల్ రాణించాడు.
తొలి ఇన్నింగ్స్లో అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటైన యశస్వి జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్లో ఒంటరి పోరాటం చేస్తూ వివాదాస్పద రీతిలో వెనుదిరిగాడు. కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ బాల్ను థర్డ్ మ్యాన్ దిశగా ఆడబోయిన జైస్వాల్.. కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఆసీస్ రివ్యూ తీసుకుంది.

రిప్లేలో బంతి బ్యాట్ను తాకినట్లు స్పష్టమైన ఆధారం లభించలేదు. స్నికో మీటర్లోనూ బంతి గ్లోవ్, లేదా బ్యాట్ను తాకినట్లు కనిపించలేదు. కానీ బంతి డివియేట్ అయ్యిందని థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది. స్పష్టమైన ఆధారం లేనప్పుడు ఆన్ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడాలి కదా? అనే చర్చ జరుగుతోంది.
ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ప్యాట్ కమిన్స్ను ఈ వికెట్పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇది క్లియర్ ఔటని బదులిచ్చాడు. 'యశస్వి జైస్వాల్ వికెట్తో మాకు పెద్ద ఉపశమనం లభించింది. అతన్ని ఔట్ చేసేందుకు మేము అన్ని విధాల ప్రయత్నించాం.

ఓ ఎండ్లో పరుగులిచ్చేందుకు కూడా రెడీ అయ్యాం. స్నికోలో బంతి గ్లోవ్, బ్యాట్ను తాకినట్లు తేలకపోవడంతో ఆందోళనకు గురయ్యాను. కానీ ఔట్ ఇచ్చేందుకు తగిన ఆధారాలు ఉండటంతో సంతోషపడ్డాను.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీతో కలిసి నిలకడగా ఆడిన జైస్వాల్.. అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటవ్వడం టీమిండియాకు తీవ్ర నష్టం చేసింది. ఫీల్డింగ్లోనూ యశస్వి జైస్వాల్ కీలకమైన మూడు క్యాచ్లు నేలపాలు చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులు చేయగా.. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆలౌటవ్వగా.. భారత్ 155 పరుగులకు కుప్పకూలింది.