
నాగ్పూర్: భారత స్పిన్నర్ల అద్భుత బౌలింగ్కు రోహిత్ శర్మ అసాధారణ ఇన్నింగ్స్.. తమ ఓటమిని శాసించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. బ్యాటింగ్కు ప్రతికూలమైన వికెట్పై రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో తమను ఒత్తిడిలోకి నెట్టాడని తెలిపాడు. శనివారమే ముగిసిన తొలి టెస్ట్లో సమష్టిగా విఫలమైన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కమిన్స్.. తమ ఓటమికి గల కారణాన్ని వెల్లడించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మరో 100 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ఇక భారత జట్టు అసాధారణ ప్రదర్శన కనబర్చిందని ప్రశంసించాడు.
'గేమ్ కొన్నిసార్లు వేగంగా సాగుతూ ఉంటుంది. ఆ టెంపోను ఆటగాళ్లు కూడా కొనసాగించాలి. టీమిండియా అద్భుతంగా ఆడింది. టర్నింగ్ వికెట్లపై భారత స్పిన్నర్లు ఎప్పుడూ రాణిస్తారు. రోహిత్ శర్మ తన క్లాస్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో వికెట్పై టర్న్ ఉన్నప్పటికీ.. మరీ బ్యాటింగ్ చేయలేనటువంటి పరిస్థితులు అయితే లేవు. తొలి ఇన్నింగ్స్లో మేం మరో 100 పరుగులు చేసుంటే భారత్పై కాస్త ఒత్తిడి ఉండేది. నిజానికి భారత్లో శుభారంభం అందుకోవడం చాలా కష్టం.
అయితే మా జట్టులోని ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్లో సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేశారు. ఆ ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేయాల్సి ఉంది. టాడ్ మర్ఫీ అరంగేట్రంలోని అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. చాలా ఓవర్లు బౌలింగ్ చేశాడు.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
243 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(25 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(5/37) ఐదు వికెట్ల ఘనత అందుకోగా.. జడేజా(2/34), మహమ్మద్ షమీ(2/13) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో నాలుగు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
అంతకుముందు 321/7 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ను 139.3 ఓవర్లలో 400 పరుగులకు ముగించింది. ఓవర్నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా(70) త్వరగానే ఔటైనా.. అక్షర్ పటేల్(174 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 84) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. టెయిలెండర్ మహమ్మద్ షమీ(47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 37) విలువైన పరుగులతో భారత్కు భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఏడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. నాథన్ లియోన్కు ఓ వికెట్ దక్కింది.