బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ ఓటమితో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. ఈ పరాజయాన్ని ఎంత త్వరగా మరిచిపోతే అంత మంచిదని అభిప్రాయపడ్డాడు. 'ఈ రోజును వీలైనంత త్వరగా మరిచిపోవాలి. ఎందుకంటే మాకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంది. ఈ మ్యాచ్తో మా దూకుడుకు బ్రేక్ పడింది. టీ20 క్రికెట్లో ఇలాంటి రోజులు ఉంటాయి.

బ్యాటింగ్లో మాకు శుభారంభం దక్కలేదు. దాంతో మేం భారీ లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం. బంతితోనూ మేం రాణించలేకపోయాం. వాస్తవానికి మేం సన్వీర్ సింగ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించాలనుకోలేదు. ఎక్స్ట్రా బౌలర్గా ఉమ్రాన్ మాలిక్ను బరిలోకి దించాలనుకున్నాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో బ్యాటింగ్ డెప్త్ కోసం సన్వీర్ సింగ్ను ఆడించాల్సి వచ్చింది.
కానీ ఇది కూడా మాకు కలిసి రాలేదు. కోల్కతా నైట్రైడర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. అయితే మ్యాచ్ సాగుతున్నా కొద్ది పిచ్ బ్యాటింగ్కు అనుకూలం అయ్యింది. దురదృష్టవశాత్తు చాలా త్వరగా పిచ్ మారింది. ఈ ఓటమిని మరిచి ముందుకు సాగడం చాలా ముఖ్యం. కొత్త వేదికగా క్వాలిఫయర్-2 జరుగనుండటం కలిసొచ్చే అంశం. మళ్లీ ఫ్రెష్గా మొదలుపెట్టి పరిస్థితులను మాకు అనుకూలంగా మలుచుకోవాలి.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 32), ప్యాట్ కమిన్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/34) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్.. 13.4 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వెంకటేశ్ అయ్యర్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 51 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సన్రైజర్స్ బౌలర్లలో నటరాజన్, కమిన్స్ తలో వికెట్ తీసారు.
ఈ ఓటమితో తృటిలో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకున్న సన్రైజర్స్ హైదరాబాద్.. శుక్రవారం చెన్నై జరిగే క్వాలిఫయర్-2లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు పూర్తి ఆధిపత్యం చెలాయించిన కేకేఆర్ ఫైనల్కు దూసుకెళ్లింది.