మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ అసాధారణ బ్యాటింగ్తోనే మెల్బోర్న్ టెస్ట్లో టీమిండియాను ఓడించామని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా సోమవారం ముగిసిన నాలుగో టెస్ట్లో ఆసీస్ 184 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది.
340 పరుగుల భారీ లక్ష్యచేధనకు బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 155 పరుగులకు కుప్పకూలింది. యశస్వి జైస్వాల్(208 బంతుల్లో 8 ఫోర్లతో 84) ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ప్యాట్ కమిన్స్(3/28), స్కాట్ బోలాండ్(3/39) మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లయన్(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ తలో వికెట్ తీసారు.

రెండు ఇన్నింగ్స్ల్లో బ్యాట్తో పాటు బంతితో సత్తా చాటిన ప్యాట్ కమిన్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా కమిన్స్ మాట్లాడుతూ.. ఈ విజయం మరిచిపోలేనిదన్నాడు. 'ఇదో అద్భుతమైన టెస్ట్ మ్యాచ్. నేను ఆడిన టెస్ట్ల్లోనే ఇది అత్యుత్తమమైనది . ఐదు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్కు భారీ ఎత్తున ప్రేక్షకులు హాజరవ్వడం గొప్ప విషయం.
అభిమానులు భారీ సంఖ్యలో హాజరైన మ్యాచ్లో భాగమవ్వడం సంతోషంగా ఉంది. రెండో ఇన్నింగ్స్లో మార్నస్ లబుషేన్ మమ్మల్ని గట్టెక్కించాడు. అతనికి నేను సహకరించినందుకు సంతోషంగా ఉంది. స్టీవ్ స్మిత్ అద్భుతంగా ఆడాడు. టాస్ గెలిచి తొలి రోజే 400 పరుగులు చేయడం అంత సులువైన పనికాదు. భారత్కు విజయవకాశాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే డిక్లేర్ చేయలేదు.
భారీ లక్ష్య చేధన ఉంచాలనుకున్నాం. వాళ్ల బ్యాటర్ల చుట్టూ హెల్మెట్లతో మోహరించాం. లోయరార్డర్ బ్యాటింగ్పై మేం చాలా వర్క్ చేశాం. స్లో ఓవర్ రేట్కు గురయ్యే అవకాశాలు ఉండటంతోనే ట్రావిస్ హెడ్తో బౌలింగ్ చేయించాను. ట్రావిస్ హెడ్ మాకు మంచి బ్రేక్ త్రూ అందించాడు. స్మిత్ ఈ వికెట్పై ఎలా ఆడాలో ఆడి చూపించాడు. అతను అద్భుతమైన క్యాచ్లు కూడా అందుకున్నాడు. సిడ్నీ టెస్ట్కు ముందు ఈ విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్లో 474 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. 105 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆలౌటైంది.