ఐపీఎల్ 2025 సీజన్ను భారీ విజయంతో ముగించడంపై సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టు ఆటగాళ్లు స్థాయికి తగ్గట్లు ఆడి ఉంటే ఫైనల్ చేరేవాళ్లమని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన సన్రైజర్స్ హైదరాబాద్ 110 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఆరెంజ్ ఆర్మీకి ఇది రెండో అతిపెద్ద విజయం కాగా.. ఐదు వరుస ఓటముల తర్వాత కేకేఆర్పై ప్రతీకారం తీర్చుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కమిన్స్.. తమ బ్యాటింగ్ బీభత్సంగా సాగిందని చెప్పాడు. 'ఈ సీజన్లో మాకు అద్భుతమైన ముగింపు లభించింది. చివరి మూడు మ్యాచ్ల్లో మాకు అన్ని కలిసి వచ్చాయి. ఈ మ్యాచ్లో మా బ్యాటింగ్ భయంకరంగా ఉంది. మాకు ఉన్న ఆటగాళ్ల స్థాయిని బట్టి మేం ఈ సీజన్ కంటే మరి దారుణంగా ఆడలేం. మా ఆటగాళ్లతో మేం ఫైనల్ చేరాల్సింది. కానీ ఈ ఏడాది మాకు కలిసి రాలేదు. ఈ తరహా బ్యాటింగ్ పిచ్లపై మేం 250-260 పరుగులు, ఇతర వికెట్లపై 170 పరుగులు చేసుంటే ఫలితాలు మాకు అనుకూలంగా ఉండేవి. కానీ ఈ సీజన్లో మేం అలా చేయలేకపోయాం.

ఈ సీజన్లో చాలా మందికి అవకాశాలు ఇచ్చాం. జట్టులో ఎంపిక చేసిన ప్రతీ ఒక్కరిని పరిశీలించాం. కానీ కొందరికి అవకాశం ఇవ్వలేకపోయాం. మాకు ఉన్న జట్టు పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. కొంతమంది ఆటగాళ్లు గాయాలతో స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ సీజన్లో మేం 20 మంది ఆటగాళ్లను ఉపయోగించాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 278 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్లతో 105 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 32) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్(2/42) రెండు వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. మనీష్ పాండే(37), హర్షిత్ రాణా(34), సునీల్ నరైన్(31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. జయదేవ్ ఉనాద్కత్(3/24), ఇషాన్ మలింగా(3/31), హర్ష్ దూబే(3/34) మూడేసి వికెట్లు తీసారు.