తమ జట్టు విధ్వంసకర బ్యాటింగ్ సంతోషాన్ని కలిగించినా.. బౌలర్గా ఆందోళనకు గురయ్యానని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన హైస్కోరింగ్ గేమ్లో సమష్టిగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్(32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో 89), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 46) ధాటికి పవర్ ప్లేలో ఆరెంజ్ ఆర్మీ 125 పరుగులు చేసింది.

సన్రైజర్స్ జోరుకు కుల్దీప్ యాదవ్(4/55) బ్రేక్ వేసినా.. షెహ్బాజ్ అహ్మద్(29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 59 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో భారీ స్కోర్ అందించాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. జేక్ ఫ్రెజర్-మెక్గుర్క్(18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్లతో 65),అభిషేక్ పోరెల్(22 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 42), రిషభ్ పంత్(35 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 44) రాణించినా ఫలితం లేకపోయింది.
సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్(4/19) నాలుగు వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. మయాంక్ మార్కండే(2/26), నితీష్ కుమార్ రెడ్డి(2/17) రెండేసి వికెట్లు తీసారు. వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్లకు తలో వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. టీమ్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ బ్యాటర్లు ధాటిగా ఆడటం సంతోషాన్ని కలిగించినా.. తాను కూడా ఇదే పిచ్పై బౌలింగ్ చేయాలనే ఆలోచన ఆందోళనకు గురిచేసిందని తెలిపాడు. 'మరో అద్భుతమైన క్రికెట్ మ్యాచ్. ఇక్కడ మంచి రికార్డు నమోదు చేశాం. పవర్ ప్లేలో ఇరు జట్ల బౌలర్లు ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారు.
అనంతరం బంతి కాస్త పాతబడిన తర్వాత పరుగుల వేగం తగ్గింది. ఓవరాల్గా బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. ఛేజింగ్లో డ్యూ ఏం రాలేదు. బంతి పాతబడిన తర్వాత బౌలర్లకు పట్టు లభించింది. ఇదే మ్యాచ్కు కీలకమైంది.
మా బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన ఉత్సాహానికి గురి చేసింది. కానీ ఇదే వికెట్పై బౌలింగ్ చేయాలనే ఆలోచన ఆందోళన కలిగించింది (నవ్వుతూ). మా బౌలింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. ప్రతీ ఒక్కరు మైదానంలో క్రమశిక్షణగా ఉన్నారు. 'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు