పవర్ ప్లేలో ధారళంగా పరుగులిచ్చుకోవడంతో పాటు కీలకమైన క్యాచ్లు నేలపాలు చేయడం తమ ఓటమిని శాసించిందని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్ 38 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన కమిన్స్.. ఈ ఓటమికి తాను కూడా ఓ బాధ్యుడినేనని అంగీకరించాడు. 'పవర్ ప్లేలో మా బౌలింగ్ గొప్పగా లేదు. ఈ విషయంలో నాకు గిల్టీగా ఉంది. పవర్ ప్లేలోనే మేం 20-30 పరుగులు అదనంగా ఇచ్చాం. ఒకటి, రెండు క్యాచ్లను మేం పట్టాల్సింది. ఇక్కడ కూడా నేనే దోషిని. 200 పరుగుల లక్ష్యం అయితే ఛేదించేందుకు సులువుగా ఉండేది.

గుజరాత్ బ్యాటర్లు క్లాస్ ఆటగాళ్లు. వాళ్లు అనవసర షాట్స్ ఆడరు. బ్యాడ్ బాల్స్ వేస్తే మాత్రం వదలరు. ఈ మ్యాచ్లో మేం చాలా చెత్త బంతులు వేసాం. వాస్తవానికి ఇది మంచి పిచ్. బౌలింగ్ విషయంలో చివరి 14 ఓవర్లలో 140 పరుగులు మాత్రమే ఇవ్వడం గొప్ప విషయం. అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా బాగా ఆడాడు. మా బ్యాటర్లు బంతులు ఎక్కువగా వదిలేయడంతో పాటు లేట్గా ఆడారు. గతేడాది మెగా వేలం జరిగింది. గత మూడేళ్లుగా ఆడిన కోర్ టీమ్ను కొనసాగించారు. అయినా ఈ సీజన్ మాకు కలిసి రాలేదు.
అహ్మదాబాద్ అద్భుతమైన వేదిక. ఇక్కడి ప్రేక్షకులు చాలా గట్టిగా అరుస్తూ ఆటను ఆస్వాదిస్తారు.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఇదే వేదికగా జరిగిన వన్డే 2023 ప్రపంచకప్ ఫైనల్కు ముందు అహ్మదాబాద్ స్టేడియంను నిశబ్దంగా ఉంచుతామని చెప్పిన కమిన్స్.. అన్నట్లుగా విజయం సాధించి అభిమానుల నోర్లు మూయించాడు. ఈ క్రమంలోనే అతను ఇక్కడి ప్రేక్షకులు గురించి మాట్లాడాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసి ఓటమిపాలైంది.