గుజరాత్ టైటాన్స్ పేసర్ల అద్భుత ప్రదర్శనతోనే తాము ఓటమిపాలయ్యామని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. డ్యూ కూడా తమ విజయవకాశాలను దెబ్బతీసిందని చెప్పాడు. తమ జట్టు శైలికి భిన్నంగా పిచ్ ఉందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి(34 బంతుల్లో 3 ఫోర్లతో 31), హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ప్యాట్ కమిన్స్(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/17) నాలుగు వికెట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్మన్ గిల్(43 బంతుల్లో 9 ఫోర్లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 49), షెర్ఫేన్ రూథర్ఫోర్డ్(16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సన్రైజర్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ(2/28) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు. సన్రైజర్స్ హైదరాబాద్కు వరుసగా ఇది నాలుగో పరాజయం కావడం గమనార్హం.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. ఇది హైదరాబాద్ సంప్రదాయ పిచ్లా లేదన్నాడు. 'ఇది ఏమాత్రం హైదరాబాద్ సంప్రదాయ వికెట్ కాదు. బ్యాటింగ్కు చాలా కష్టంగా మారింది. దాంతో మ్యాచ్పై పట్టు సాధించలేకపోయాం. మేం ఆశించినంత స్పిన్ కూడా లభించలేదు. మేం కొన్ని పరుగులు తక్కువ చేశాం. గుజరాత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. డ్యూ కూడా ప్రభావం చూపింది. పిచ్ పేస్కు అనుకూలంగా ఉందనే సిమర్జిత్ సింగ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించాం. ముందుగా రాహుల్ చాహర్ను ఆడించాలనుకున్నాం. కానీ గుజరాత్ పేసర్లు మమ్మల్ని కట్టడి చేయడంతో సిమర్జిత్ సింగ్ను బరిలోకి దించాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.