ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత భారత జట్టులో ఒక్కరికి కూడా ఆసీస్ టీమ్లోకి ఎంపికయ్యే అర్హత లేదని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్యాట్ కమిన్స్పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి తెరలేవనుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా అధికారిక బ్రాడ్ కాస్టర్స్ మాజీ క్రికెటర్లతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే మాజీ క్రికెటర్ల తమ మాటల తూటాలతో ఈ సిరీస్పై భారీ హైప్ను క్రియేట్ చేశారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఉద్దేశించి తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్సైట్ నిర్వహించిన చిట్ చాట్లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు నాథన్ లయన్, మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ పాల్గొన్నారు. ఈ చిట్చాట్లో ప్రస్తుత భారత జట్టులో నుంచి ఆస్ట్రేలియా జట్టుకు అవసరమయ్యే ఒక్క ఆటగాడు ఎవరో చెప్పాలని ఈ నలుగుర్ని ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పారు.
ముందుగా కమిన్స్.. ఒక్కరు కూడా లేరని తెలిపాడు. ఆసీస్ జట్టుకు ఎంపికయ్యే సామర్థ్యం భారత ఆటగాళ్లకు లేదని పరోక్షంగా పేర్కొన్నాడు. నాథన్ లయన్ విరాట్ కోహ్లీని ఎంచుకోగా.. మిచెల్ మార్ష్.. రిషభ్ పంత్, ట్రావిస్ హెడ్.. రోహిత్ శర్మలను ఎంచుకున్నారు.
'నేను టాపార్డర్ బ్యాటర్గా రోహిత్ శర్మను తీసుకుంటా. అతని బ్యాటింగ్ చాలా దూకుడుగా ఉంటుంది. మీరంతా విరాట్ పేరు చెబుతారని ఊహించి ఉండొచ్చు. అందుకే నేను మరో దారిలో రోహిత్ శర్మ పేరును ఎంచుకున్నా.'అని ట్రావిస్ హెడ్ బదులిచ్చాడు.
'విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ గురించి మాట్లాడేవాడు. 2014లో మాపై అతని యుద్దం మొదలైంది. అడిలైడ్ వేదికగా జరిగిన నాటి మ్యాచ్లో విరాట్ రెండు ఇన్నింగ్స్ల్లో శతకాలు నమోదు చేశాడు. నా బౌలింగ్ను సునాయసంగా ఆడాడు.
నాన్స్ట్రైకర్ వైపు వచ్చి నాతో ఫెదరర్ అని అరిచేవాడు. అతను తరుచూ ఫెదరర్ అని గట్టిగా అరిచేవాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడని అనుకునేవాడిని. కోహ్లీని ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకుంటే స్మిత్, మార్నస్, విరాట్ కోహ్లీతో టాపార్డర్ పటిష్టం అవుతుంది.'అని నాథన్ లయన్ చెప్పుకొచ్చాడు.