
మెల్బోర్న్: కరోనా వైరస్ కకలావికలం తర్వాత క్రికెట్ను మొదలుపెట్టేందుకు ఉన్న గొప్ప మార్గం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అని ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ టీ20 ప్రపంచకప్కు సన్నాహకంగానూ ఉపయోగపడుతుందన్నాడు. గతేడాది ఐపీఎల్ 2020 సీజన్ కోసం జరిగిన వేలంలో కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఫ్రాంచైజీ రికార్డు స్థాయిలో రూ.15.5 కోట్లు వెచ్చించి కమిన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఇక కరోనా కారణంగా తాను లాక్డౌన్లో ఉన్నా.. కేకేఆర్ యాజమాన్యంతో టచ్లో ఉన్నానని కమిన్స్ వెల్లడించాడు. 'కేకేఆర్ యాజమాన్యం, స్టాఫ్తో ఎప్పుడు మాట్లాడినా ఐపీఎల్ జరుగుతుందనే నమ్మకంతోనే వాళ్లు ఉన్నారు. వాళ్ల మాటలను బట్టి చూస్తే ఈ ఏడాది ఏదో స్టేజ్లో కచ్చితంగా లీగ్ జరుగుతుందనే నమ్మకం ఉంది. అందుకే ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. క్రికెట్ను మళ్లీ మొదలుపెట్టేందుకు కూడా ఐపీఎల్ ఓ గొప్ప అవకాశాన్నిస్తుంది. మనకు ప్రపంచకప్ కూడా ఉంది. కాబట్టి నాణ్యమైన టీ20 క్రికెట్ ఆడాలంటే ఐపీఎల్ జరగాలి.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఇక షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్-2020 సీజన్ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ వాయిదా పడి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. ఐపీఎల్ 2020 సీజన్ జరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే దేశంలో విధించిన లాక్డౌన్ 4.0లో కొన్ని సండలింపులు ఇచ్చిన భారత ప్రభుత్వం.. ప్రయాణాలపై మాత్రం ఆంక్షలు విధించింది. ఈ ట్రావెల్ ఆంక్షలు ఏత్తేసిన వెంటనే ఐపీఎల్ నిర్వహిద్దామనుకున్నా.. వర్షకాలం అంతరాయం కలిగించనుంది. ఇదే విషయాన్ని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ కూడా తెలిపాడు. వర్షం కాలం తర్వాతే ఐపీఎల్ జరిగే అవకాశాలున్నాయన్నాడు.