సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది. భారత అభిమానులు బిచ్చగాళ్లని ప్యాట్ కమిన్స్ అన్నాడని కొందరు ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
ముఖ్యంగా పాకిస్థాన్కు చెందిన నెటిజన్లు ఈ ప్రచారానికి తెరలేపారు. కానీ ఆ వీడియోలో ప్యాట్ కమిన్స్ ఎక్కడ కూడా బిచ్చగాళ్లు అనే పదం ఉపయోగించలేదు. చాలా మంది భారత అభిమానులు డబ్బు సాయం కోసం తనను సంప్రదిస్తున్నారని మాత్రమే చెప్పాడు.

'కొంతమంది భారత అభిమానులు.. నా ఇంటి అడ్రస్ కనుగొని డబ్బు సాయం చేయాలని ఆసుపత్రి బిల్లులను పంపించారు. మరికొందరు ఆఫరేషన్స్, ఇతర చికిత్సలు చేసుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మెసేజ్లు పంపుతున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా విచిత్రంగా అనిపించింది.'అని ఆ వీడియోలో కమిన్స్ చెప్పుకొచ్చాడు.
అయితే ఈ వీడియోను కొందరు పనిగట్టుకొని భారతీయులు బిచ్చగాళ్లని ప్యాట్ కమిన్స్ అన్నాడనే క్యాప్షన్తో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు సాయం అడిగినంత మాత్రానా బిచ్చగాళ్లు అయిపోతారా? అయినా కమిన్స్ ఎక్కడా ఆ మాట అనలేదని గుర్తు చేస్తూ సదరు నెటిజన్లపై మండిపడుతున్నారు.
కరోనా సమయంలో ప్యాట్ కమిన్స్.. భారత ప్రధాన సహాయనిధికి 50 వేల డాలర్లను విరాళంగా ఇచ్చాడు. ఆ సమయంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఈ డబ్బును ఖర్చు చేయాలని కమిన్స్ కోరాడు. ఈ సాయంతో కమిన్స్ను గొప్పవాడిగా భావించిన కొందరు భారత అభిమానులు.. తమకు సాయం చేయాలని రిక్వెస్ట్ చేసి ఉండవచ్చు.
పెద్ద సంఖ్యలో సాయం చేయాలనే మెసేజ్లు రావడంతో కమిన్స్ కాస్త ఇబ్బంది పడి ఉంటాడు. ఆ విషయాన్ని అతను తెలియజేశాడు. కానీ ఎక్కడా కూడా భారత్ను, ఇక్కడి ప్రజలను తక్కువ చేసి మాట్లాడలేదని క్రికెట్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. కమిన్స్కు భారత్ అంటే ఎంతో గౌరవం ఉందని, అందుకే కరోనా సమయంలో సాయం చేశాడని గుర్తు చేస్తున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు సారథ్యం వహించిన ప్యాట్ కమిన్స్... అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సూపర్ కెప్టెన్సీతో జట్టును ఫైనల్కు చేర్చాడు. తృటిలో టైటిల్ చేజారినా.. తమ ఆటతీరుతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున డబ్ల్యూటీసీ టైటిల్తో పాటు వన్డే ప్రపంచకప్ గెలిచిన కమిన్స్.. టీ20 ప్రపంచకప్ 2024పై కన్నేసాడు.