
అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ నిలిపివేయడం ద్వారా భారత్లో నెలకొన్న విప్కతర పరిస్థితులు మెరుగవుతాయా? అని విమర్శకులను కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ ప్రశ్నించాడు. ఐపీఎల్ను ఆపమనడం సమంజసం కాదన్నాడు. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా, లివింగ్ స్టోన్, ఆండ్రూ టై లాంటి విదేశీ ఆటగాళ్లు భవిష్యత్తుపై ఆందోళనకు గురై బయోబబుల్లో ఉండలేమంటూ లీగ్ను విడిచిపెట్టి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దాంతో ఈ కఠిన పరిస్థితుల్లో ఐపీఎల్ను కొనసాగించడమా? అనే చర్చ ఊపందుకొంది. కొందరైతే లీగ్ను నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిబేట్పై స్పందించిన కమిన్స్ ఐపీఎల్ నిర్వహణ కలిగే నష్టం ఏంటో చెప్పాలన్నాడు. 'మేము ఐపీఎల్ ఆడుతున్నామంటే ఇక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామనేది మాకు తెలుసు. బయోబబుల్లో ఉంటూ క్రికెట్ ఆడడం మాకు అలవాటుగా మారిపోయింది. అయినా మేము రోజు మూడు నుంచి నాలుగు గంటలపాటు మాత్రమే మైదానంలో ఉంటూ ఆటలో మజాను అందిస్తున్నాం. బయట కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలంతా ఇంట్లోనే ఉంటూ ఐపీఎల్ మ్యాచ్లను వీక్షిస్తున్నారు. మా వల్ల వారికి హాని జరగకపోగా.. మేలు జరుగుతుంది. ఒక రోజులో మూడు నాలుగు గంటల పాటు మా ఆటను ఆస్వాదిస్తూ టీవీలకే అతుక్కుపోతున్నారు. సమస్య ఇంకెక్కడ ఉంది. మేం చేస్తున్న ఈ పనికి ఐపీఎల్ను ఆపాలని చెప్పడం కరెక్ట్ కాదు'' అని చెప్పుకొచ్చాడు.
భారత్లోని విపత్కర పరిస్థితులను చూసి చలించిపోయిన కమిన్స్.. కరోనా బాధితుల కోసం 50వేల డాలర్లు విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. అంతేకాకుండా తన సహచర ఆటగాళ్లకు కూడా తోచిన సాయం చేయాలని పిలుపునిచ్చాడు. గత సీజన్ నుంచి కేకేఆర్కు ప్రాతనిథ్యం వహిస్తున్న కమిన్స్.. ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లాడి 82 పరుగలతో పాటు 4 వికెట్లు తీశాడు. ఇక సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన ఈ ఆసీస్ స్టార్.. ఒకానొకదశలో కేకేఆర్ను విజయంవైపు నడిపించాడు. కేవలం 34 బంతుల్లోనే 66 పరుగులతో అజేయంగా నిలిచి సీఎస్కే వెన్నులో వణుకు పుట్టించాడు. ఇక కమిన్స్ను కేకేఆర్ 2020 ఐపీఎల్ వేలంలో రూ. 16 కోట్ల భారీ ధరకు కొనులు చేసింది.