మొహాలీ: అరకొర ప్రదర్శన కారణంగానే భారత్తో తొలి వన్డేలో ఓటమి పాలయ్యామని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. జట్టులో కొందరు బ్యాటింగ్ అద్భుతంగా చేస్తే.. మరికొందరు బౌలింగ్లో సత్తా చాటారని చెప్పాడు. ఓవరాల్గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఓటమి తప్పలేదని స్పష్టం చేశాడు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉంటే విజయాన్ని అందుకునేవాళ్లమని తెలిపాడు. 'ఈ మ్యాచ్లో ఓడినా.. వ్యక్తిగతంగా సంతృప్తి దక్కింది. గాయాల నుంచి కోలుకోని ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇవ్వడం.. భారత్ వేదికగా రాణించడం ఆనందంగా ఉంది.

మా జట్టులో కొందరు ఆటగాళ్లు బ్యాట్తో మెరిస్తే.. మరికొందరు బౌలింగ్లో రాణించారు. ఓవరాల్గా వారి ప్రదర్శన మా విజయానికి సరిపోలేదు. గాయాలతో బాధపడుతున్న ఆటగాళ్లు రెండో వన్డేకు కూడా అందుబాటులో ఉండరు. మూడో వన్డేతో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మ్యాక్స్వెల్ నిన్ననే భారత్కు వచ్చాడు.
స్మిత్, డేవిడ్ వార్నర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దరూ రాణించడం మా జట్టుకు కలిసొచ్చే అంశం. మేం వన్డే ప్రపంచకప్పై కూడా ఓ కన్నేసాం. అందుకే ఆటగాళ్ల విషయంలో తొందరపడటం లేదు. అయితే ప్రపంచకప్ ముందే స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చి రిథమ్ అందుకోవాలి.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ వార్నర్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. జోష్ ఇంగ్లీస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబుషేన్(39) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఐదు వికెట్లకు తోడుగా.. జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 10 ఫోర్లతో 71), శుభ్మన్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 74)తో పాటు కేఎల్ రాహుల్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా రెండు వికెట్లు తీయగా.., పాట్ కమిన్స్, సీన్ అబాట్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.