సిడ్నీ: ఐపీఎల్ 2020 సీజన్ ఆడటంపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ క్లారిటీ ఇచ్చాడు. క్యాష్ రిచ్ లీగ్ ఎప్పుడు జరిగినా.. తాను ఆడటానికి సిద్దమేనని తెలిపాడు. ఇక ఈ సారి జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్స్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కమిన్స్ కోసం అన్ని ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. దీంతో అతని ధర అమాంతం పెరిగింది.
చివరకు కోల్కతా నైట్రైడర్స్ ఏకంగా రూ. 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే.. కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఈ క్యాష్ రిచ్ లీగ్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో ఈ టోర్నీ జరగడంపైనా సందిగ్ధత నెలకొంది. ఈ టోర్నీ నిర్వహణపై బీసీసీఐ కూడా ఎటు తేల్చుకోలేకపోతుంది.
ఇక కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో ఆస్ట్రేలియా కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరో 6 నెలల వరకు సరిహద్దులు మూసివేసింది. అయితే కమిన్స్ మాత్రం ఐపీఎల్ జరిగితే తాను ఆడుతానని తెలిపాడు. 'ఐపీఎల్ 2020 సీజన్ రద్దు నిర్ణయం ఇంకా తీసుకోలేదు. కాబట్టి.. ఇంకా టోర్నీపై ఆశలు సజీవంగా ఉన్నట్లే. అందుకే.. టీమ్ ఫ్రాంఛైజీతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాను.
అయితే.. వెంటనే టోర్నీ జరిగే అవకాశాలున్నాయని నేను చెప్పను. కానీ.. ఐపీఎల్ 2020 సీజన్ మాత్రం జరిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడు టోర్నీ నిర్వహించినా.. నేను ఆడతాను'' అని పాట్ కమిన్స్ స్పష్టం చేశాడు. 2018 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్కి ఆడాల్సిన పాట్ కమిన్స్ గాయం కారణంగా సీజన్ మొత్తానికీ దూరమవగా.. 2019 వన్డే ప్రపంచకప్కు సిద్ధమయ్యేందుకు గత సీజన్లో ఆడలేదు.
ఐపీఎల్ ఎప్పుడు నిర్వహించినా.. భారత్కి వచ్చి తాము ఆడేందుకు సిద్ధమని ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్స్మిత్ ప్రకటించగా.. తాజాగా ఈ జాబితాలో పాట్ కమిన్స్ కూడా చేరాడు. పర్యాటక వీసాల్ని ఏప్రిల్ 15 వరకూ భారత ప్రభుత్వం రద్దు చేయగా.. దేశంలో విధించిన 21 రోజుల లాక్డౌన్ ఏప్రిల్ 14న ముగుస్తుంది. కాబట్టి.. ఏప్రిల్ మూడో వారంలో ఐపీఎల్ 2020పై ఓ నిర్ణయం వెలువడనుంది.