సమష్టి ప్రదర్శనతోనే విజయం సాధించామని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చెన్నై గడ్డపై గెలుపు జెండా ఎగురవేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేయడం కలిసొచ్చిందన్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేశామని చెప్పాడు.
'ఇదో గొప్ప విజయం. ఈ రాత్రి మాకు కొన్ని విషయాలు కలిసి వచ్చాయి. మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. మా బౌలర్లు సమష్టిగా రాణించారు. టాపార్డర్ బ్యాటర్లే మ్యాచ్ను ముగించాలనుకున్నారు. కానీ కండిషన్స్కు తగ్గట్లు డిఫెన్సివ్గా ఆడి విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేశాం. హెన్రీచ్ క్లాసెన్ను అప్ది ఆర్డర్ పంపించి.. నితీష్ కుమార్ రెడ్డికి ఫినిషర్ రోల్ ఇచ్చాం. సీఎస్కేపై మాకు గొప్ప రికార్డ్ లేదు. దాన్ని సరిచేయాలనుకున్నాం. ఈ మ్యాచ్ను మరింత సౌకర్యంగా ముగించాలనుకున్నాం. మొత్తానికి ఈ విజయంతో సంతోషంగా ఉన్నాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 42), ఆయుష్ మాత్రే(19 బంతుల్లో 6 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/28) నాలుగు వికెట్లతో సీఎస్కే పతనాన్ని శాసించాడు. ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, కామిందు మెండీస్ తలో వికెట్ తీసారు.
అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 44), కామిందు మెండీస్(22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్(2/42) రెండు వికెట్లు తీయగా. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో సన్రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.