సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో అత్యధిక ధర పలికినంత మాత్రాన బంతి వెంటనే స్వింగ్ అవ్వదని ఆస్ట్రేలియా స్టార్ పేసర్, కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఆటగాడు ప్యాట్ కమిన్స్ అన్నాడు. గతేడాది కేకేఆర్ కమిన్స్ను రూ.15.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, యూఏఈ వేదికగా జరిగిన ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఈ ఆసీస్ పేసర్ తీవ్రంగా నిరాశపరిచాడు. అంచనాల మేరకు రాణించలేకపోయాడు. 14 మ్యాచ్ల్లో కేవలం 12 వికెట్లు మాత్రమే తీసాడు. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 సీజన్ నేపథ్యంలో తాజాగా కేకేఆర్ యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడిన అతను పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎక్కడ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడినా తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని కమిన్స్ చెప్పుకొచ్చాడు. 'మంచి ప్రదర్శన చేసి వస్తే.. అలాంటి ప్రదర్శనే చేయాలనే ఒత్తిడి ఉంటుంది. ఒకవేళ ముందు మ్యాచ్లో చెత్త ప్రదర్శన చేస్తే.. ఇక్కడికొచ్చాక రాణించాలనే ఒత్తిడి ఉంటుంది. ఎలా చూసినా బౌలర్పై ఒత్తిడి మాత్రం ఖచ్చితం. దీనికి తోడుగా ఐపీఎల్ వేలం మరో విధమైన ఒత్తిడిని కలగజేస్తుంది. దాన్ని అలాగే భరిస్తూ సమన్వయం చేసుకోవాలి. అత్యధిక ధర పలికినంత మాత్రాన బంతి స్వింగ్ అవ్వదు. బౌండరీ లైన్ మారదు. పిచ్లో తేడా ఉండదు. మైదానం అలాగే ఉంటుంది. అలాంటప్పుడు నేను ఇంకా ఎలా బాగా ఆడతాననే విషయంపైనే దృష్టిసారిస్తా. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ పద్ధతి ద్వారానే కోల్కతాకు సరైన ఫలితాలు తీసుకొస్తానని ఆశిస్తున్నా' అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.