
మంచి ఆరంభం కానీ
ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ (52; 98 బంతుల్లో 5x4, 1x6), శుభ్మన్ గిల్ (31; 64 బంతుల్లో 4x4) అదిరే శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ తొలి వికెట్కు 71 పరుగులు జోడించారు. దీంతో మంచి ఆరంభం దక్కింది, విజయానికి బాటలు పడ్డాయని సంతోషించేలోపే.. ఓపెనర్లు ఇద్దరూ ఒక్కసారిగా నిరాశపరిచారు. జోష్ హేజిల్వుడ్ వేసిన 23వ ఓవర్లో గిల్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ 71 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఆపై చేటేశ్వర్ పుజారా క్రీజులోకి వచ్చి హిట్మ్యాన్కు అండగా నిలిచాడు.

ఇంకా 309 పరుగులు
కాసేపటికే రోహిత్ అర్ధ శతకం సాధించాడు. 30వ ఓవర్లో నాథన్ లైయన్ బౌలింగ్లో బౌండరీ బాదిన హిట్మ్యాన్.. విదేశాల్లో టెస్టు ఓపెనర్గా తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే పాట్ కమిన్స్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి బౌండరీ లైన్ వద్ద మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. టీమిండియాకు భారీ షాక్ తగిలింది. అప్పటికి స్కోర్ 92/2గా నమోదైంది. ఆ తర్వాత నిలకడగా ఆడిన పుజారా, రహానె మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ఆటను పూర్తి చేశారు. ఆస్ట్రేలియా బౌలర్స్లో హేజిల్వుడ్, కమ్మిన్స్కు చెరో వికెట్ దక్కింది. భారత్ విజయం సాధించాలంటే 309 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా విజయం కోసం ఎనిమిది వికెట్స్ కావలసి ఉంది.

స్మిత్ సూపర్
ఆదివారం ఉదయం 103/2 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండు సెషన్లు బ్యాటింగ్ చేసింది. తొలి సెషన్లో 79 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. రెండో సెషన్లోనూ మరో రెండు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఓవర్నైట్ వ్యక్తిగత స్కోరు 47తో ఈరోజు బ్యాటింగ్ని కొనసాగించిన మార్కస్ లబుషేన్ (73: 118 బంతుల్లో 9x4) హాఫ్ సెంచరీ నమోదు చేసి నవదీప్ సైనీ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ మాథ్యూ వెడ్ (4: 11 బంతుల్లో 1x4)ని కూడా సైనీ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 10 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు చేజార్చుకుంది. స్టీవ్ స్మిత్ (81; 167 బంతుల్లో 8x4, 1x6) అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ బాదాడు.

గ్రీన్ తొలి అర్ధ శతకం
తొలి ఇన్నింగ్స్లో శతకంతో అదరగొట్టిన స్మిత్.. రెండో ఇన్నింగ్స్లోను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే కామెరాన్ గ్రీన్ (84; 132 బంతుల్లో 8x4, 4x6)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి ఔట్ అయ్యాడు. ఆపై గ్రీన్, టిమ్ పైన్ (39; 52 బంతుల్లో 6x4) ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. బుమ్రా వేసిన 83వ ఓవర్ ఐదో బంతికి బౌండరీ బాదిన గ్రీన్.. టెస్టుల్లో తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. టీ బ్రేక్కి ముందు గ్రీన్ ఔటవగా.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, సైనీ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, బుమ్రాకి ఒక వికెట్ దక్కింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 338 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులుకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది.
మళ్లీ నోటికి పనిచెప్పిన ఆసీస్ ఫ్యాన్స్.. సిరాజ్పై మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు (వీడియో)


Click it and Unblock the Notifications
