ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్(SRH) అభిమానులకు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గుడ్ న్యూస్ చెప్పాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న తాను వేగంగా కోలుకుంటున్నానని, సీజన్ మధ్యలో బరిలోకి దిగుతానని తెలిపాడు.
ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ సందర్భంగా వెన్ను గాయానికి గురైన ప్యాట్ కమిన్స్.. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగానే అతను ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కూడా ఆడలేదు. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లకు కూడా ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలను ఇషాన్ కిషన్కు అప్పగించారు.
గాయంతో ఆరంభ మ్యాచ్లకు దూరమైనా.. ప్యాట్ కమిన్స్ బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిసాడు. గాయంతో ఇబ్బంది పడుతున్నా జట్టుతో కలిసి అతను ప్రయాణించనున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కమిన్స్ పాల్గొన్నాడు. వార్మప్లు, ఫీల్డింగ్, క్యాచ్లు ప్రాక్టీస్ చేశాడు. తక్కువ రనప్తో ఖాళీ నెట్స్లో కొన్ని బంతులు కూడా బౌలింగ్ చేశాడు.

తాజాగా టీమ్ సోషల్ మీడియా టీమ్తో మాట్లాడిన కమిన్స్.. తాను కోలుకుంటున్నానని.. సీజన్ మధ్యలో జట్టుకు అందుబాటులోకి వస్తానని చెప్పాడు. 'నేను వెన్ను గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నా. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. చిన్నగా నెట్స్లో బౌలింగ్ కూడా చేయగలుగుతున్నా. ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కానుంది. కానీ నేను ఆరంభ మ్యాచ్లు ఆడలేకపోతున్నా.
టోర్నీ మధ్యలో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే నేను టోర్నీ రెండో భాగం, ఫైనల్స్లో మైదానంలోకి దిగుతాను' అని కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా తొలి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం(మార్చి 28న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.