
న్యూఢిల్లీ: వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు జతగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్ సూచించాడు. పేస్, బౌన్స్కు అనుకూలంగా ఉండే ఆసీస్ పిచ్లపై కోహ్లీ ఓపెనర్గా వస్తే జట్టుకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. వీరిద్దరి ఆట తీరు భిన్నంగా ఉంటుందని చెప్పాడు. రోహిత్ దూకుడుగా ఆడితే.. కోహ్లీ గ్యాప్ చూసి షాట్లు ఆడుతాడని పేర్కొన్నాడు. దాన్ని వల్ల పవర్ ప్లేలో భారత్కు రావాల్సిన పరుగులు వస్తాయని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా కాంబినేషన్పై జరుగుతున్న చర్చలో భాగంగా క్రిక్బజ్తో మాట్లాడుతూ పార్థీవ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ గడ్డపై పవర్ ప్లేలో రాణించడం చాలా ముఖ్యమని చెప్పిన పార్దీవ్.. రోహిత్-విరాట్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందన్నాడు. 'రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. విరాట్ కోహ్లీ ఖాళీలను గుర్తించి బౌండరీలను తరలించడంలో స్పెషలిస్ట్. అందుకే వీరిద్దరూ కలిసి ఓపెనింగ్ చేయాలి. అప్పుడే జట్టుకు సమతూకం వస్తుంది. నేను ఆసియా కప్నకు ముందు కూడా ఇదే చెప్పా. విరాట్తో ఓపెనింగ్ చేయిస్తే బాగుంటుంది.
ఆస్ట్రేలియా పరిస్థితుల్లో తొలి ఆరు ఓవర్ల ఆట చాలా కీలకం. ఆ పవర్ప్లే ఓవర్లలో విరాట్, రోహిత్ బ్యాటింగ్ చేస్తే కనీసం 50 పరుగుల మార్క్ను దాటేస్తారు. వికెట్ పడకుండా అలా పరుగులు చేస్తే మంచి స్కోరు సాధించే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ పిచ్లకు కోహ్లీ సరిగ్గా సరిపోతాడు. కాబట్టే ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు తొలి ఆరు ఓవర్లలో బ్యాటింగ్ చేస్తే చూడాలని అనిపిస్తుంది'అని పార్థివ్ పటేల్ వివరించాడు. జట్టులో విరాట్ కోహ్లీ స్థానంపై ఎలాంటి సందిగ్ధత లేదని చెప్పిన పార్దీవ్.. ఫామ్తో సంబంధం లేకుండా జట్టులో ఉండాల్సిన ఆటగాడు కోహ్లీ అని వెల్లడించాడు.
టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో అక్టోబర్ 23న తలపడనుంది. ఈ మెగా టోర్నీకి ముందు సన్నాహకంగా టీమిండియా సొంతగడ్డపై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 20, 23, 25 తేదిల్లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరగనుండగా.. సెప్టెంబర్ 28, అక్టోబర్ 2, అక్టోబర్ 4 తేదీల్లో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ జరగనుంది.